ఏపీ సీఎం చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే బాబు తీరు నచ్చక పార్టీకి రాజీనామా చేసిన వంశీ ఈ రోజు చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్షకు కూర్చోగా ఆ దీక్ష సాక్షిగానే ప్రెస్మీట్ పెట్టి ఏకేశారు. బాబు ద్వంద రాజకీయ విధానాల వల్లే ఈ రోజు టీడీపీ ఈ దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ? కేవలం ఏపీలో మాత్రమే బాబు ఎందుకు లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక ధర్మపోరాట దీక్షలు వద్దని చెప్పినా బాబు వినలేదన్నారు. ఇక హుజూర్నగర్లో టీడీపీకి 2 వేల ఓట్లు కూడా రాలేదని.. బాబు ప్రజాస్వామ్య తీర్పును అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారంటూ వంశీ మండిపడ్డారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి తాను మద్దతు ఇస్తున్నానని.. తాను జగన్ ప్రభుత్వంలో కలిసి నడుస్తున్నానంటూ కుండబద్దలు కొట్టేశాడు. ఇక తెలంగాణలో ఏపీలో కూడా పరిస్థితులు మారుతున్నాయని... చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారంటూ వంశీ ఫైర్ అయ్యారు.
మంచిని కూడా చెడు అని ప్రచారం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో జనం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా ఇంగ్లీషు విద్యను పేద పిల్లలకు చెప్పిస్తుంటే దానిపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మీ మనవడికి, మీ పిల్లలకు ఒక న్యాయం, పేదలకో న్యాయమా?. టీడీపీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
లోకేష్ను ఆడుకున్న వంశీ...
ఇక నారా లోకేష్ను సైతం వంశీ ఆడేసుకున్నారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని ఆయన పుత్రరత్నం, ఆయన సలహాదారుల వల్లే టీడీపీ టైటానిక్ షిఫ్ అయిపోయిందని... అక్రమ కేసులు బనాయించినా, జగన్కు ప్రజలు ఏకంగా 151 సీట్లతో అధికారం కట్టబెట్టారని.. అలాంటి నాయకుడితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.