దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 130వ జయంతి సందర్భంగా విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటుగా....ఉప ప్రధాని సర్ధార్ వల్లబభాయ్ పటేల్ గురించి సైతం...సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నెహ్రూపై నాలుగు సార్లు జరిగిన...హత్యల ప్రయత్నాలు...ఇందులో గాంధీజీ హంతకుల గురించి...మరోమారు ప్రస్తావనకు వచ్చింది.
1948 జూలైలో నెహ్రూపై జరిగిన తొలి హత్య కుట్రను బీహార్ పోలీసులు భగ్నం చేశారు. కీలక సమాచారం ఆధారంగా ఢిల్లీకి వెళ్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నెహ్రూతోపాటు పటేల్ను కూడా హత్య చేయాలని ఈ ముగ్గురు కుట్ర పన్నినట్లు నాడు పత్రికల్లో ప్రధానంగా వార్తలొచ్చాయి. మహాత్మాగాంధీ హత్యకు బాధ్యులైన వారి తర్వాత లక్ష్యం నెహ్రూ అని నిర్ధారణ అయ్యింది. 1950లో తూర్పు పాకిస్థాన్లో అల్లర్ల నేపథ్యంలో నెహ్రూను హత్య చేసేందుకు కుట్ర జరిగినట్లు అఖిల భారత హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు ఎల్పీ భోపత్కర్ అంగీకరించారు అని రెండో హత్యాయత్నం గురించి పటేల్ పేర్కొన్నారు. 1953లో మూడో కుట్ర కూడా భగ్నమైంది. నెహ్రూ ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు పట్టాలపై బాంబులు అమర్చుతున్న ఇద్దరిపై పోలీసులు కాల్పులు జరిపారు. 1955లో నాగపూర్ సందర్శన సందర్భంగా నాలుగోసారి హత్యాయత్నం జరిగింది. ఓ రిక్షా కార్మికుడు కత్తితో దాడికి యత్నించాడు.
1948లో జాతిపిత మహాత్మా గాంధీ హత్య తర్వాత నెహ్రూ ప్రాణాలకూ ముప్పు ఉంటుందని నాటి ఉప ప్రధాని, కేంద్ర తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో భయపడ్డారట. పటేల్ కుమార్తె మణిబెన్ ఈ ఆశ్చర్యకర అంశాలను పంచుకున్నారు. నెహ్రూను కూడా హత్య చేస్తారన్న భయంతో ఆయన నిద్రలేని రాత్రులు గడిపారని మణిబెన్ వెల్లడించారు. తొలి ప్రధానిగా నెహ్రూకు ఎంతో ప్రజాదరణ లభించినప్పటికీ ఆయన ప్రాణాలకూ అంతే ముప్పువాటిల్లిందని మణిబెన్ విశ్లేషించారు.