లెక్క తేలింది. చర్చలు సఫలమయ్యాయి. పదవుల పంపకంపై క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలింది.. ప్రభుత్వ ఏర్పాటే..! రేపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహారాష్ట్ర గవర్నర్ను కలవనున్నాయి. ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మహారాష్ట్ర సంక్షోభం క్లైమాక్స్ చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య డీల్ కుదిరింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయి. అధికారంలోకి వస్తే అమలు చేయాల్సిన కనీస ఉమ్మడి ప్రణాళికకు మూడు పార్టీలు ఆమోద ముద్ర వేశాయి. పదవుల పంపకాల విషయంలోనూ మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మొదటి నుంచి శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతోంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ అందుకు అంగీకరించాయి. సోనియా కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శివసేన, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు శరద్ పవర్. ఐదేళ్లపాటు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం మహారాష్ట్ర గవర్నర్ను కలవబోతున్నట్లు తెలిపారు. ఒప్పందంలో భాగంగా శివసేనకు ఐదేళ్లు సీఎం పదవితో పాటు 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ ఓకే చెప్పాయి. ఎన్సీపీకి 14 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇక కాంగ్రెస్కు స్పీకర్ పోస్టుతో పాటు 12 మంత్రి పదవులు ఇచ్చేందుకు డీల్ కుదరింది. ఎల్లుండి సోనియా గాంధీని కలవబోతున్న శరద్ పవార్ చర్చల సారాంశాన్ని వివరిస్తారు. శనివారం మహారాష్ట్ర గవర్నర్ను కలిసిన తర్వాతే.. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలకు తెరపడబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన మధ్య సయోధ్య కుదిరింది. సీఎం పదవి శివసేనకు, మంత్రులు, డిప్యూటీ సీఎం పదవులు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు పంచుకున్నాయి. దీంతో ఉత్కంఠకు తెరపడింది.