వంశీ పాచిక పారింది ... వైకాపా సభ్యునిగా కొనసాగేందుకు లైన్ క్లియర్?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వేసిన పాచిక పారింది . టీడీపీ నాయకత్వం తనని సస్పెండ్ చేయాలని భావించి, ఆ పార్టీ నాయకత్వం పై వంశీ తీవ్రస్థాయి విమర్శలు చేసిన విషయం తెల్సిందే . టీడీపీ నుంచి తనని సస్పెండ్ చేస్తే, ఆ పార్టీ శాసనసభా పక్షం … తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉండదని వంశీ అంచనా వేశారు . దాంతో తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా, వైకాపా అనుబంధ సభ్యుడిగా వెసులుబాటు లభిస్తుందని వంశీ భావించారు .
అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వంశీ ఒంటికాలిపై లేస్తూ విమర్శలు గుప్పించడమే కాకుండా , తాను వైకాపా అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తానని ప్రకటించారు . టీడీపీ నాయకత్వం పై విమర్శలు చేసిన వంశీ మోహన్ ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు . వంశీ వేసిన ఎత్తుగడ తెలిసి నా , పార్టీ అధినేత , జాతీయ ప్రధాన కార్యదర్శి పై తీవ్ర విమర్శలు చేసిన వంశీ మోహన్ ను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని సస్పెన్షన్ వేటు వేసింది .
తనపై టీడీపీ నాయకత్వం వేటు వేయడం పై వంశీ స్పందిస్తూ తనని టీడీపీ నాయకత్వం సస్పెండ్ చేయడం ఏమిటనీ, తానే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కు రోషం ఉంటే పార్టీ మారిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని దీక్ష చేయాలని సూచించారు . నల్లబట్టలతో ప్రధాని మోడీ , హోంశాఖ మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా దీక్ష చేయగలరా అంటూ ప్రశ్నించారు .