అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభాన్ని ఎ దుర్కుంటోంది. మొన్నటి మొన్న నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాంరాం చెప్పగా.. నిన్న గ న్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి గుడ్బై చెప్పారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారనే ప్రచారం నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా.. ఇక టీడీపీతో తెగదెంపులు చేసుకునేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.
గంటాతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే ఉత్తరాంధ్రలో గట్టిపట్టున్న టీడీపీకి భారీ షాక్ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే టీడీపీని వీడితే ఏ పార్టీలో చేరాలన్న దానిపై కొంత డైలమాలో ఉన్నట్లు సమాచారం. చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపే సదరు మాజీ మంత్రి మొగ్గు చూపుతున్నారట.
దీంతో తన అనుచరులు అందరితో కలిసి త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి గంటా శ్రీనివాసరావు రెడీ అయిపోతున్నారని టాక్. రాష్ట్రం మొత్తం జగన్ సునామీ సృష్టించినా.. విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుంది. అయితే వీరిలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు తప్ప మిగిలిన ముగ్గురూ పార్టీ జెండా ఎత్తేస్తారని అంటున్నారు. గంటా నాయకత్వంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
గణబాబు గంటాతో పాటే గతంలో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ఆయనతో పాటే తిరిగి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోనూ చేరారు. ఇపుడు కొత్తగా జత కలుస్తున్నది మాత్రం వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. గంటాశ్రీనివాసరావు పార్టీని వీడితే విశాఖ జిల్లాలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టకుపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.