అటు కేసీఆర్ ఇటు అశ్వర్థామరెడ్డి నలిగిపోతున్న జనం...!
గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ రోజు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని కేసిఆర్ ప్రభుత్వానికి చెప్పారు. కానీ కేసిఆర్ నుండి ఉలుకు పలుకు లేదు. లేబర్ కోర్ట్ తీర్పు కోసం కెసిఆర్ వెయిట్ చేస్తున్నట్టు కనపడుతోంది.
కానీ కార్మికుల్లో దాదాపు 80 శాతం మంది విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామనే నిర్ణయానికి వచ్చారు. మరో 20 శాతం మంది మాత్రం సమ్మె కొనసాగిస్తామ ని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసి సంఘాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బంతి ఇప్పుడు కేసిఆర్ కోర్ట్ లో ఉంది. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటారా లేదా అని డిమాండ్ చేస్తున్నారు. రేపు ఉదయం వరకు ఎదురు చేసే ఆలోచనలో ఉన్నారు. అప్పటి వరకు ఎవరు మీడియా ముందు మాట్లాడొద్దు అని ఆర్టీసి సంఘాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి.
ఒకవేళ కేసిఆర్ వైఖరి లో మార్పు రాకుంటే మాత్రం … పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ లతో ఆర్టీసి బస్సులు నడిపిస్తోంది. ఆర్టీసి కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా కెసిఆర్ వైఖరి లో మార్పు లేకపోతే, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు ఆర్టీసి బస్సులు ముట్టుకోవద్దని కార్మికులు హెచ్చరించే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ ఉద్యోగులకు , ఆర్టిసి కార్మికులకు మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి, కార్మికులను విధుల్లోకి తీసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ సాయంత్రం ఆర్టీసీపై సమీక్ష చేయబోతున్నారు. ఈ మీటింగ్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ అంశంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు సీఎం పంతానికి అటు కార్మికుల పట్టుదలకి మధ్య జనం నలిగిపోతున్నారు. జనం ఇక్కట్లు మాములుగా లేవు అయినా ఇప్పటివరకు ఏ బంద్ కూడా ఇన్ని రోజులు కొనసాగడం అనేది ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు.