జగన్.. ఆ ముగ్గురినీ అస్సలు వదలడం లేదుగా..?
ఇటీవల కాలంలో ఏపీలో ఇసుక ఇంగ్లీష్ హాట్ టాపిక్ లుగా మారాయి. ప్రత్యేకించి జగన్ సర్కారు ఇంగ్లీష్ విద్యపై పట్టుదలగా ఉంది. ఈ విషయంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని జగన్ ఉపేక్షించడంలేదు. వారిలో ఇద్దరు ఎల్లో మీడియాగా పేరుబడిన రెండు పత్రికాధిపతులూ, ఇంకొకరు ఉప రాష్ట్రపతి వెంకయ్య ఉన్నారు. ఈ ముగ్గురినీ జగన్ ఏ సభలోనూ వదలడం లేదు. వీరి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు.
గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆ సభలోనూ వారిని వదలలేదు. అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్న ప్రభుత్వం మీద బురదజల్లాలని పనిగా పెట్టుకుని ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 790 మంది మత్స్యకారుల పిల్లలు గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం మీద రాద్ధాంతం చేసే పత్రికాధిపతుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో ప్రశ్నించాలని సూచించారు.
మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివి టైలు కట్టుకుని ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లుగా కారుల్లో తిరుగుతుంటే చూడాలన్నదే తన కోరక అని వివరించారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడొద్దా అని ప్రశ్నించారు.. ఐదు నెలలుగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా కింద 46 లక్షల కుటుంబాలకు రూ. 13500 వంతున పెట్టుబడి సాయం, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల సాయం, అగ్రి గోల్డ్ బాధితులకు బకాయిల చెల్లింపు.. అడుగడుగునా ప్రజా సంక్షేమం కోసం తపిస్తున్న ప్రభుత్వాన్ని దీవించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్బోన్ క్లాసులనే విధంగా వారికి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా మనదేనన్నారు.