నల్లమలలో మైనింగ్ కు అనుమతి ఇవ్వ లేదన్న కేంద్రం

DRK Raju

ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతానికి అరకిలోమీటరు దూరంలో మైనింగ్ జరుగుతోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం  లోక్ సభ  దృష్టికి తెచ్చారు. మైనింగ్ వల్ల అటవీ ప్రాంతానికి నష్టం జరగడమే కాకుండా అక్కడ నివసించే గిరిజనులకు కూడా నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. అలాగే నది నీటి కాలుష్యానికి దారితీస్తోందని పేర్కొన్నారు .దీనివల్ల గిరిజనుల జీవించే హక్కు కు కూడా భంగం కలుగుతుందని తెలిపారు. దీనికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో  లిఖితపూర్వకంగా సమాధానం తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో మైనింగ్ కు తాము ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా అటవీ ప్రాంతాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అటువంటిదేమీ లేదని తెలిపారు.

 ఢిల్లీలో కాలుష్య నివారణకు ఎన్నో చర్యలు

దేశ రాజధాని ఢిల్లీలో, మరికొన్ని పొరుగు రాష్ట్రాల్లో ఏర్పడిన తీవ్ర కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. పంట వ్యర్థాల దగ్ధం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని రాష్ట్రాలలొ ఏర్పడిన వాతావరణ కాలుష్యాన్ని  ఏ  మేరకు నివారించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభ  లో శుక్రవారం వేసిన మరొక  ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా జవాబు తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో పంట   వ్యర్ధాలను తగల పెట్టడం వల్ల ఢిల్లీలో శీతాకాల మాసాల్లో ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యం చాలా తీవ్రస్థాయికి చేరుతుందని పేర్కొన్నారు. అది రెండు నుంచి 45 శాతానికి పెరగడం  వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయని, దీన్ని అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల తో కలిసి ఒక కార్యాచరణ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.వందల కోట్ల రూపాయలను దీనికోసం  ఇస్తున్నామని, ఇప్పుడిప్పుడే ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు కాలుష్యాన్ని   నివారించేందుకు రైతులకు భూమిని బట్టి నగదు ను ఇవ్వటమే కాకుండా, వారిని చైతన్య పరిచి యాంత్రిక వినియోగాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ప్లాంట్లలో పంట  వ్యర్ధం  కలిపి మండించేందుకు ఒక ఒప్పందం కూడా కుదిరిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: