అసలు ఆ రాత్రి ఏం జరిగింది..?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియాలంటే మహారాష్ట్ర రాజకీయాలు చూడాలి. రాజకీయాల్లో తలపండిన వ్యక్తులకు సైతం తలదన్నేలా రాజకీయాలు నడపడంలో దిట్ట శరద్ పవార్. అలాంటి పవార్ ను సైతం బోల్తా కొట్టించి... కొత్త రాజకీయాలకు తెరతీసింది బీజేపీ. ఆఖరి అస్త్రం బయటకు తీయడం... బీజేపీ.. అజిత్ పవార్ నేతృత్వంలో గవర్నర్ ను కలవడం.. గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం అన్ని వరసగా జరిగిపోయాయి.
తెల్లారి లేచే సరికి జరిగిన విషయాలు తెలుసుకొని షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే సరికి శరద్ పవార్, కాంగ్రెస్, శివసేన పార్టీలు షాక్ అయ్యాయి. బీజేపీకి శివసేన హ్యాండ్ ఇవ్వడంతో.. బీజేపీ తన అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీసింది. ఎవరిని ఎలా దెబ్బకొట్టాలో అలా కొట్టింది. తనకు మద్దతు ఇచ్చే వ్యక్తుల లిస్టును బటయకు తీసింది. అజిత్ పవార్ ను బయటకు తీసుకొచ్చి.. మద్దతు ఇచ్చేలా చేసింది.
ఇక అజిత్ పవర్ కు 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. అయితే, సాయంత్రం సమయంలో ఈ 35 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ దగ్గర హాజరయ్యారు. ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు ఇవ్వడం లేదు అన్నది ప్రస్తుతానికి సైలెన్స్ గా ఉన్నది. బలనిరూపణకు ఈనెల 30 వరకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. కానీ, వెంటనే బలనిరూపణ చేసుకోవాలని శరద్ పవార్, కాంగ్రెస్, శివసేనలు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాయి. ఈ ఉదయం 11 గంటలకు దీనిపై విచారణ జరుగుతున్నది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం.
నవంబర్ 22
8:00 (రాత్రి) ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతల భేటీ
8:45–9:00 భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్ పవార్. 10:00–10:30 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్మీట్లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. 11:30–11:50 బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్.
నవంబర్ 23
12:00 (అర్ధరాత్రి): తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్. 12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది. 12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ. 2:30–2:45: రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన. 5:30: రాజ్భవన్ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్. 5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్. 7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం. 8:45: ఫడ్నవీస్, అజిత్ పవార్లను అభినందించిన ప్రధాని మోదీ. 8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు. 10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు. 10.30: శరద్తో భేటీ అయిన నవాబ్ మాలిక్. 11:00: హోటల్ మరీన్ ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ.
12.30: వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మీడియా సమావేశం
1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్.
సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్ పవార్ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు. 6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన.
రాత్రి 8.00 అజిత్పై వేటు వేసిన ఎన్సీపీ. క్లుప్తంగా ఆ రాత్రి, మరునాడు సాయంత్రం వరకు జరిగిన విషయాలు ఇవి. ఈరోజు సుప్రీం విచారణపై విషయం ఆధారపడి ఉంటుంది.