టీడీపీని అఖిల నాశనం చేస్తున్నారా... బాబు బ్రేక్ వేస్తారా...!
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్కడి కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతున్నారు. చిన్నా పెద్దా నాయకులను స్వయంగా దగ్గరకు పిలిచి వారి సమస్యలను చంద్రబాబు వినే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఏం కావాలో వారి అభిప్రాయాలను చంద్రబాబు వినే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక జిల్లా నాయకుల పని తీరు, వారు ఎంత వరకు అందుబాటులో ఉంటున్నారు, వారి వ్యవహారశైలి వంటివి చంద్రబాబు నేరుగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో భూమా కుటుంబం మీద చంద్రబాబుకి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అఖిల ప్రియ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులపై చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు నేతలు. ఆమె మంత్రిగా ఉండి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో వర్గాలను తయారు చేశారని, ఏవీ సుబ్బారెడ్డి వ్యతిరేక వర్గం, గంగుల కుటుంబానికి ఒక వ్యతిరేక వర్గం, మరికొంత మందికి వ్యతిరేక వర్గం అంటూ ఆమె పెంచి పోషించారట.
ఇక తన మాట వినని వారిని ఆమె వేధించారని, వారి సమస్యలను కూడా కనీసం వినలేదని, నంద్యాల, ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లో తానే ఎమ్మెల్యే అనే విధంగా వ్యవహరించారని చంద్రబాబుకి ఆమెపై ఫిర్యాదులు భారీగా అందాయి. ఇదే వ్యవహారశైలి ఉంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని... ఇప్పటికి కూడా ఆమె తాను చెప్పినట్టే వినాలి అనే తత్వంలో ముందుకి వెళ్తున్నారని, వెంటనే ఆమెను కొన్ని బాధ్యతల నుంచి తప్పిస్తే మంచిది అని చంద్రబాబుకి జిల్లాకు చెందిన నేతలు సూచించారట.
నంద్యాల ఉప ఎన్నికలలో గెలవడం, మంత్రి పదవి దక్కడంతో ఆమె తనకు అడ్డు ఎవరు లేరు అనే భావనలో ఉండి మొత్తం రెండు, మూడు నియోజకవర్గాల్లో పార్టీని సర్వ నాశనం చేసిందని వారు చంద్రబాబుకి ఫిర్యాదు చేశారట. ఇక బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ. జనార్థన్రెడ్డి సైతం అఖిల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. మరి బాబు ఇప్పటకీ అయినా అఖిల్ దూకుడుకు బ్రేకులు వేస్తారేమో ? చూడాలి.