జనసేన అధ్యక్షుడిగా వైఎస్ జగన్!

Suma Kallamadi

మీరు చదివింది నిజమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను జనసేన అధినేతను చేసేసింది ఓ మహిళ. ఆమె పడిన తడబాటు.. సాక్షాత్తూ పవన్ కల్యాణ్ నూ నవ్వుల్లో ముంచేసింది. ఒకరిద్దరి ముందు కాదు.. ఏకంగా వందల మంది జనం గుమిగూడిన సమయంలో.. ఆమె అన్న మాట.. అందరినీ ఓ సారి ఆశ్చర్యానికి గురి చేసినా.. అంతలోనే అందరినీ పగలబడి నవ్వేలా చేసింది.

 

అసలు విషయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మదనపల్లెలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కొందరు మహిళలు సభపైకి వచ్చి.. ఓ వైపు జగన్ ను తిడుతూ.. మరోవైపు పవన్ ను పొగుడుతూ స్పీచ్ ల మీద స్పీచ్ లు దంచేశారు. ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా ఎవరైనా మాట్లాడతారా అంటూ.. పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ అక్కడున్న మహిళలను అడిగారు. అయోమయంగానే వచ్చి స్టేజ్ ఎక్కిన ఓ మహిళ.. అందరికీ నమస్కారం పెట్టారు.

 

అక్కడే ఉన్న పవన్ ను చూసిన ఆనందమో.. ఆయనతో మాట్లాడుతున్న ఆశ్చర్యమో తెలియదు కానీ.. జనసేన అధినాయకుడు జగనన్నకు నమస్కారం అని అనేశారు. జగన్ ఏంటి.. జనసేన అధినేత ఏంటి అనుకుంటూ.. అంతా ఒక్కసారి ఘొల్లున నవ్వేశారు. ఆ విషయాన్ని గమనించిన సదరు మహిళ.. తాను మొదటిసారి సభలో మాట్లాడుతున్నానని.. తప్పుంటే క్షమించాలని కోరింది. ఇందుకు పవన్ కూడా.. సరదాగా తీసుకుని.. నవ్వేశారు. ఆమెను మాట్లాడాలంటూ అనుమతించారు.

 

ఇలా.. పవన్ మొహంలో.. జగన్ నవ్వులు పూయించారన్నమాట. పరిస్థితులు అనుకూలించకనో.. లేక ఎదుటివారి అజ్ఞానమో తెలియదు కానీ.. పవన్ మాత్రం ఈ మధ్య ఏం చేసినా.. ఎటు వెళ్లినా ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మధ్య దిశ హత్యోదంతం కేసుకు సంబంధించి.. ఉరి శిక్ష ఎందుకు.. బెత్తం దెబ్బలు చాలు అంటూ తనకు తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్.. ఇప్పుడు తన సమక్షంలోనే తన పార్టీకే తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ ను ఓ మహిళ అధ్యక్షుడిగా సంబోధించడం.. ఆయన్ను కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: