దిశ కోసం నలుగురిని చంపారు.. ఆ ముగ్గురి కోసం వీడిని చంపాలంటున్న హాజీపూర్వాసులు
దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ తో అలాంటి నేరాల్లో మిగిలిన వారికీ ఇదే శిక్ష వేయాలంటున్నారు జగన్.. ఇదే తరహా ఉదంతాల్లోని నేరగాళ్లను కూడా ఉరి తీయాలంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముగ్గురు బాలికలను కిరాతకంగా చంపిన సైకో కిల్లర్ శ్రీనివాస్ నూ ఇదే తరహాలో ఎన్ కౌంటర్ చేయాలంటున్నారు హాజీపూర్ గ్రామస్తులు.
కేవలం డిమాండ్ చేయడమే కాదు.. కిల్లర్ శ్రీనివాస్ ను వెంటనే చంపాలంటూ ధర్నా కూడా చేస్తున్నారు. శ్రీనివాస్ను శిక్షించే విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అసలు ఇంతకీ హాజీపూర్లో ఏంజరిగింది.. ఈ సైకో కిల్లర్ ఎవరు.. అతడు ఏం చేశాడు.. ఓసారి గుర్తు చేసుకుందాం.. గత ఏప్రిల్ 25న బొమ్మలరామారంలోని పాఠశాల నుంచి హాజీపూర్కు తిరిగి వెళ్తుండగా శ్రావణి అదృశ్యమైంది. మరుసటి రోజు ఏప్రిల్ 26న శ్రీనివాస్రెడ్డికి చెందిన బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొన్నారు.
అనుమానితుడైన శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోటింగ్ ఇస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. అతడి నిజస్వరూపం తెలుసుకున్న హాజీపూర్ వాసులు శ్రీనివాస్రెడ్డి ఇంటిని తగలబెట్టారు. అంతకుముందు ఇదే గ్రామంలో మాయమైన మనీషా ను కూడా శ్రీనివాసరెడ్డే చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఇద్దరే కాదు.. మూడేళ్ల క్రితం మాయమైన 11 ఏళ్ల కల్పననూ శ్రీనివాసరెడ్డే చంపానని ఒప్పుకున్నాడు.
అప్పట్లో సైకో కిల్లర్ శ్రీనివాస్ ఉదంతం మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేయడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. శ్రీనివాస్రెడ్డి వరంగల్ జైల్లో ఉన్నాడు.