వాళ్లు ఓటేస్తామంటోన్నా తల పట్టుకుంటోన్న బాబు... రీజన్ ఇదే..!
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో... ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. గ్రామాల్లో ఒకప్పుడు బలంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు అక్కడ బలహీనపడటానికి కారణం వాళ్ళే. రాజకీయంగా బలంగా ఉన్న వాళ్ళు... గ్రామాల్లో కార్యకర్తలను గాని, చిన్న చిన్న నాయకులను గాని దగ్గరకు రానిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఏ విధంగా చూసినా సరే వాళ్ళ పెత్తనమే పార్టీలో ఎక్కువగా ఉండేది అనేది అందరికి అర్ధమయ్యేది. దీనితో చాలా మంది పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టారు. ఎన్నికల్లో కూడా వాళ్ళు పని చేయడానికి ఇష్టపడలేదు.
దీనితో గ్రామ స్థాయిలో భారీగా నష్టపోయింది పార్టీ. ఈ పరిస్థితిని ఎమ్మెల్యేలకు చెప్పినా సరే అప్పట్లో పెద్దగా ఫలితం కూడా ఉండేది కాదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ బలపడటానికి గాను ప్రతీ జిల్లాలో వరుసగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబుకు కొందరు నేతల తీరు గురించి కొన్ని ఫిర్యాదులు అందుకున్నారు.
గ్రామాల్లో పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేవనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. ఇప్పుడు కార్యకర్తలకే పెత్తనం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా వారితో మాట్లాడుతున్నారు. గ్రామాల్లో మీరు పని చేయండి మీకోసం నేను ఉన్నాను.. నా దగ్గరకి రండి అవసరమైతే అని చెప్పారు. అయినా సరే చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసం పని చేయడానికి ముందుకి రావడం లేదు.
రేపు చంద్రబాబు లేని సమయంలో ఈ పరిస్థితులు పునరావృతం అవుతాయని... తమను పట్టించుకునే నాథుడు ఉండడు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉంటే ఓటు వేస్తామని వీళ్ళ మధ్యలో మేము పని చేయలేమని చెప్తున్నారట. దీంతో ఇప్పుడు బాబు తలలు పట్టుకుంటోన్న పరిస్థితి.