దిశ నిందితుల ఎన్ కౌంటర్ : పోలీసులపై కేసు
దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ పై ఇప్పటికే అనేకమంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అటు జాతీయ మానవహక్కుల కమీషన్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయంలో మరో పిటిషన్ దాఖలైంది. పురహక్కుల సంఘం నేత లక్ష్మణ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. సీపీ సజ్జనార్ తో పాటుగా మరో 9 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలనీ అయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దిశ కేసు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్టుగా జాతీయ మానవ హక్కుల కమీషన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. కానీ, పోలీసులు మాత్రం అందరు మేజర్లే అని చెప్తున్నారు.
అయితే, పాఠశాల సర్టిఫికెట్ ప్రకారం ఇందులో మైనర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది నిజమే అయితే పోలీసులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. పోలీసులకు ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉన్నది. జనాల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ ఎన్ కౌంటర్ చేశారా లేదంటే నిజంగానే తప్పించుకోవడానికి నిందితులు ప్రయత్నం చేస్తే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారా అన్నది తెలియాలి.
అయితే, ఎన్ కౌంటర్ విషయంలో కొన్ని ప్రాధమిక అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే, నిందితులను స్పాట్ కు తీసుకెళ్లినప్పుడు చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తారు. కానీ, వాళ్లకు బేడీలు వేసి లేవు. పైగా ఎన్ కౌంటర్ జరిగిన తరువాత కూడా వాళ్ళు తుపాకిని వదలకుండా పట్టుకున్నారు. దీంతో కొంతమంది మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే... టెక్నికల్ గా గన్ లాక్ చేసి ఉంటె.. దాన్ని అన్ లాక్ చేసి కాల్చే తెలివి వాళ్లకు ఉన్నదా అనే డౌట్ కూడా వస్తున్నది. మొత్తానికి ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్నది. చివరకు ఎటువైపుకు వెళ్తుందో చూడాలి.