సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు..
ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణ, వాటి పర్యవేక్షణ, విధివిధానాలను ప్రత్యేక కమిషనర్ కన్నబాబు వివరించారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడం, ప్రజలకు సంక్షేమం, అభివృద్థిని చేరువ చేసేందుకు సచివాలయాలు పనిచేయాల్సిన విధానంపై చర్చించారు. ప్రత్యేక వ్యవస్థగా సచివాలయాలను ముందుకు తీసుకువెళ్ళాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగానికి బాధ్యతలను అప్పగించడం ద్వారా జవాబుదారీతనంను పెంచుతామని వివరించారు. గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సచివాలయాల పనితీరు, పర్యవేక్షణ శాస్త్రీయంగా వుండాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రులు సూచించారు.
పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయం కేంద్రంగా మొత్తం సచివాలయ ఉద్యోగులు పని చేయాలని అన్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు నిర్వర్తిస్తున్న విధులను గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో మరింత పకడ్భందీగా ప్రజలకు చేరువ చేసేలా చూడాలని అన్నారు. వివిధ విభాగాల నుంచి నియమకాలు పొందిన ఉద్యోగులు సచివాలయం కేంద్రంగా సమన్వయంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో పదిమంది వరకు వుండే ఉద్యోగులు తమ సచివాలయం యూనిట్ గా విధులను నిర్వర్తించాలని, అదే క్రమంలో మాతృసంస్థతోనూ, ఇటు సచివాలయ వ్యవస్థతోనూ అనుసంధానమై తమ పనులను కొనసాగించాలని సూచించారు.