తెలుగు వారి కళ్లన్నీ ఏపీ అసెంబ్లీపైనే ...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపధ్యం లో ఇప్పుడు అందరి దృష్టి ఏపీ అసెంబ్లీపైనే కేంద్రీకృతం అయింది . శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన చేసిన విషయం తెల్సిందే . రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నియమించిన జీఎన్ రావు నిపుణుల కమిటీ , బోస్టన్ సంస్థ ఇచ్చిన నివేదికలు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సూచించాయి . దీనితో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసి , జీఎన్ రావు కమిటీ, బోస్టన్ సంస్థ నివేదికలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది .
ఆ రెండు నివేదికలను ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన హైపవర్ కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక ను సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది . కేబినెట్ భేటీ లో హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించి , అనంతరం అసెంబ్లీలో చర్చించనున్నారు . రాష్ట్రం లో మూడు రాజధానుల ఏర్పాటు కు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెల్సిందే . అమరావతిని శాసన, విశాఖ ను పరిపాలన, కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది . అయితే ప్రధాన ప్రతిపక్షం , ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది .
దానిలో భాగంగానే సోమవారం అసెంబ్లీ ముట్టడికి అమరావతి రైతులిచ్చిన పిలుపుకు మద్దతునిస్తుంది . అసెంబ్లీ సమావేశాల నేపధ్యం లో సభ బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలుండడం తో ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ , సభలు , సమావేశాలు, ర్యాలీలు నిషేదించారు . సభ బయట పరిస్థితి ఎలా ఉన్న సభ లో ఏమి జరగనుందనేది ఉత్కంఠ సర్వత్రా నెలకొంది . ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారి కళ్లన్నీ, రేపు ఉదయం ఏపీ అసెంబ్లీపైనే కేంద్రీకృతం కావడం ఖాయం .