ఏపీ కేబినెట్: రాజధాని రైతులకు జగన్ అదిరే న్యూస్..
పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కేబినెట్ తీర్మానం చేసింది. ఏపీ చరిత్రలో కీలకమైన ఈ నిర్ణయంపై ఇవాళ అసెంబ్లీ చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు రైతులకు కౌలు పెంచాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు పది నుంచి పదిహేనేళ్ల వరకూ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రమంతటా మొత్తం 11 వేలకు పైగా భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఇదే సమావేశంలో ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులను శాంతపరిచేలా ఈ నిర్ణయం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలని కేబినెట్ లో మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే అమరావతి ని రాజధానిగా కొనసాగిస్తేనే ఆందోళనలు విరమిస్తామని రాజధాని ప్రాంత రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో మరి కౌలు పెంపు నిర్ణయంతో రైతులు సంతృప్తి చెందుతారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా కూడా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. ఎలాగూ రాజధాని మార్పు తప్పన్న అంచనాకు వచ్చిన రైతులు ఆందోళన విరమిస్తారా.. లేక మరింత ఉదృతం చేస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సిన సంగతి.