బడ్జెట్ గుడ్ న్యూస్....పన్ను శ్లాబ్ మారుతుందట... ఎలా అంటే...
మధ్యతరగతి, వేతన జీవులకు గొప్ప ఊరట. రాబోయే కేంద్ర బడ్జెట్లో తీపికబురు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత ఆదాయంపై పన్ను శ్లాబుల మార్పులుండవచ్చని సమాచారం. రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికీ 5 శాతం పన్నునే ప్రతిపాదించే వీలుందని సమాచారం.
ప్రస్తుతం రూ.2.5 లక్షల దాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే. రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 5 శాతం పన్ను విధిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేటు ఇస్తోంది. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటకపోతేనే ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో 5 శాతం శ్లాబును రూ.7 లక్షలకు పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
దీంతో పాటుగా మరిన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 10 శాతం పన్ను వేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రూ.5 లక్షల నుంచి 10 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారిపై 20 శాతం పన్ను పడుతుంది. ఆపై ఆదాయం ఉంటే 30 శాతం. ఈ క్రమంలో రూ.5 లక్షలు-10 లక్షల శ్లాబును సగానికి విభజించి రూ.7 లక్షల వరకు 5 శాతం, అక్కడి నుంచి రూ.10 లక్షలదాకా 10 శాతం పన్నును ప్రతిపాదించనున్నారని సమాచారం. అలాగే రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు వార్షిక ఆదాయముంటే 20 శాతం పన్నుకు వీలున్నది. రూ.20 లక్షల నుంచి 10 కోట్ల మధ్య 30 శాతం పన్నును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. రూ.10 కోట్లకు మించి వార్షిక ఆదాయమున్నవారికి కొత్తగా 35 శాతం శ్లాబును పరిచయం చేయవచ్చని తెలుస్తున్నది. ఈ మార్పులన్నీ కూడా 60 ఏండ్ల దిగువన ఉన్న వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకేనని సమాచారం. కాగా, రిబేటు కూడా రూ.7 లక్షల వరకు ఉంటుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
60-80 ఏండ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు, 80 ఏండ్లపైనున్న వారికి ఐటీ శ్లాబులు, పన్నులు వేర్వేరుగా ఉంటాయన్న సంగతి విదితమే. గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో రూ.5 లక్షల వరకు వార్షిక ఆదా యం ఉంటే పన్ను మినహాయింపునిచ్చినది తెలిసిందే. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం, మార్కెట్లో చోటుచేసుకున్న స్తబ్ధతల మధ్య వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఐటీ శ్లాబుల సవరణ, పన్ను కోతలు దోహదపడుతాయని కేంద్రం విశ్వసిస్తున్నది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించి జీడీపీకి జోష్నిచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చేసినది విదితమే.