కేటీఆర్కు `పట్టణాభిషేకం`...కేసీఆర్ సంచలన నిర్ణయం....విలేకరుల సమావేశంలో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కొత్త పదవి
కట్టబెట్టనున్నారని అంటున్నారు. కీలకమైన మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగించడం వెనుక కేటీఆర్ సత్తాయే కారణమని ప్రచారం జరుగుతుండగా...ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ఇదే సరైన సమయమని మరికొందరు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఎన్నికలపై ఇటీవలే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడంతో...సీఎం పీఠం త్వరలో యువనేతకు దక్కుతుందని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా పలు పార్టీలు పేర్కొంటుంటే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీఆర్ మాత్రం తనకు రెఫరెండం అని ప్రకటించారు. ప్రచారం చివరి రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి పురప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్శాఖమంత్రిగా మున్సిపల్ ఎన్నికలు తన పనితీరుకు నిదర్శనంగానే భావిస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
``టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మున్సిపల్ శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. పట్టణాల్లో ఉన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో జరుగబోయే మార్పులు, చేర్పులకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నా పనితీరుకు తీర్పుగానే భావిస్తాను. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికలను సమన్వయ పరుస్తున్నాను.. కాబట్టి పార్టీపరంగా పనితీరుకు, నామీద ప్రజలు ఇవ్వబోయే ఆలోచనలకు తీర్పుగానే ఈ ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత వహిస్తాను.``అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలా కేటీఆర్ తన పనితీరుకు రెఫరెండం అని పేర్కొన్న ఎన్నికల్లో గెలుపొందడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనకు సీఎం పీఠం కట్టబెడతారనే చర్చ జరుగుతోంది. కాగా, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే ఆయన స్పందనపై ఆసక్తి నెలకొంది.