కేసీఆర్, కేటీఆర్ను కాల్చి చంపినా తప్పులేదు... వాళ్లు పశువుల కన్నా హీనం...
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎంపీ సంచలన, వివాదాస్పద కామెంట్లు చేశారు. పురపాలిక ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడైన మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్ళను కాల్చి చంపిన తప్పు లేదని ఆయన వివాదాస్పద కామెంట్లు చేశారు.
యాదగిరిగుట్టలో పురపాలక ఫలితాలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ... ఇక్కడ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మెజార్టీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ...అక్రమ మార్గంగా యాదగిరిగుట్ట లో మునిసిపల్ ఛైర్మెన్ పదవిని దక్కించుకోవలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. మాకు మెజార్టీ దక్కినా...వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరితో ఎక్స్ అఫిషియో ఓటు వేయిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యన్ని ఖూని చేస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్ కేసీఆర్ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే అక్రమ భూ దందా చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. తుర్కపల్లిలో సీఎం కేసీఆర్ కూతురు కవిత అక్రమంగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఇక్కడి పేద ప్రజలకు ఏమి చేయలేదని మండిపడ్డారు. నల్గొండ మునిసిపాలిటీలో బీజేపీ, ఎంఐఎంలతో కలిసి మునిసిపల్ ఛైర్మెన్ గెలుచుకోవలని చూస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. వీటిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన యాదగిరిగుట్ట ప్రజలకు ధన్యవాదాలని పేర్కొన్న భువనగిరి ఎంపీ, యాదగిరిగుట్టను కేంద్రం నుండి నిధులు తీసుకవచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.