ప్రధాని భద్రతకు రూ.600 కోట్లు!
మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత కల్పిస్తుందనే సంగతి తెలిసిందే. దీని కోసం కేంద్ర బడ్జెట్ లో 600 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించారు.ప్రధానమంత్రి భద్రత కోసం కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులు అత్యంత భారీ స్థాయిలో ఉండటం గమనార్హం. ఏకంగా 600 కోట్ల బడ్జెట్ ను మోడీ భద్రత కోసం కేటాయించారు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్.
ఈ సారి ఎస్పీజీకి ఆర్థిక కేటాయింపులు భారీగా పెంచారు. క్రితం ఏడాది 540 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించగా, ఇప్పుడు ఆరువందల కోట్ల రూపాయలకు పెంచారు. ఇది వరకూ ఎస్పీజీ ప్రొటెక్షన్లో కొంతమంది ప్రముఖులు ఉండేవారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, మన్మోహన్ లాంటి వాళ్లకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉండేది. అయితే ఇటీవలే వారందరికీ ఆ భద్రతను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎస్పీజీ ప్రొటెక్షన్ కలిగిన ఏకైక వ్యక్తి నరేంద్రమోడీ. మరి వారందరికీ రద్దు చేసిన కేంద్రం ప్రభుత్వం మోడీకి ఇంత మొత్తంలో బడ్జెట్ ఎందుకు కేటాయించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇలా మోడీకి మాత్రమే భద్రత కల్పించే ఎస్పీజీకి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా అయ్యింది. దీంతో మోడీ భద్రత ఖర్చు 600 కోట్ల రూపాయలు అవుతోంది. సగటున రోజుకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేవలం మోడీ భద్రత కోసం బడ్జెట్ కేటాయింపులు ఉండటం సంచలన స్థాయిలో ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ భద్రతకే ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే ప్రజల భద్రతకు ఎంత కేటాయించారని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు. తన భద్రతకు కేటాయించిన బడ్జెట్లో వందల మంది పేదవాళ్లను బతికించొచ్చాని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం వారి రక్షణ గురించి ఆలోచిస్తుంది కానీ. ప్రజల రక్షణ గురించి ఆలోచించడం లేదని పలు పార్టీల నాయకులు విమర్శించారు.