మరోసారి తెరపైకి టీపీసీసీ చీఫ్ మార్పు వాదన !
మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి నాయకత్వ మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో పార్టీ బతికి బట్టకట్టాలంటే టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలంటూ హైకమాండ్కు రిక్వెస్ట్లు పెడుతున్నారు. అయితే అసలు సమస్యలను పక్కన పెట్టి నాయకత్వ మార్పు చేస్తే కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందా?
వరుస ఎన్నికల్లో ఓటమితో మరోసారి పాత రాగమే అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. టీపీసీసీ చీఫ్ ను వెంటనే మార్చాలంటూ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను ఇచ్చామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ నేతలు....ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ వరుస ఓటములు పలకరించడంతో ఆ నెపాన్ని నాయకత్వంపై తోసేసి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. అసలు పార్టీ ఎందుకు వైఫల్యం చెందుతుందని ఎన్నడూ రివ్యూల జోలికి వెళ్లకుండా, అంతర్గత కుమ్ములాటల్లో బిజీ అయిపోయారు.
నాయకత్వ మార్పు అనేది సర్వసాదరణం. కానీ కేసీఆర్ ను ఎదుర్కొనగలిగే నాయకుడికి పగ్గాలు అప్పగించాలని కొందరు, .. లేదు లేదు... పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పీసీసీ ఇవ్వొద్దని ఇంకొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. లాయల్ గా ఉండే వారికే పదవి ఇవ్వండి అని డిమాండ్ చేసిన వాళ్ళు మరి కొందరు. అయితే పార్టీ నాయకులు అసలు లాజిక్ మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అధికారంలోకి రావాలంటే కేవలం నాయకత్వ మార్పు ఒక్కటే మంత్రం కాదని, అంతర్గత సమన్వయం కూడా అవసరమంటున్నారు విశ్లేషకులు.
గడిచిన ఆరేళ్లలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పుకోదగ్గ ప్రజా ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. ప్రజల పక్షాన రోడ్డెక్కిన నాయకుడు లేరు. దీంతో జనంలోకి వెళ్లాడమే మానేసి... కుమ్ములాటలు పెట్టుకుంటే అధికారం ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తున్నారు.
పార్టీ అధిష్టానం కూడా ఇలాంటి అంశాలను వదిలేసినట్టు కనిపిస్తుంది. నాయకుల మధ్య పోటీ... అంతర్గత విభేదాలు పక్కన పెట్టేలా చేసి..అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని అధిష్టానం ఇప్పటికీ చేయడం లేదు . అంతెందుకు... పీసీసీ నాయకత్వం.... ఇప్పటి వరకు జిల్లా స్థాయి లో పర్యటనలు చేసింది కూడా అంతంత మాత్రమే. పార్టీలో సమస్యలు పరిష్కారం చేస్తూనే నాయకత్వాన్ని మార్చితే పార్టీకి బెనిఫిట్. కానీ సమస్యలు పక్కన పెట్టి... జాతీయ నాయకుణ్ణి పెట్టినా ప్రయోజనం ఆశించలేం అనేది అధిష్టానం ఎప్పుడు ఆలోచిస్తుందో చూడాలి.