ఏపీకి ఆ సత్తా ఉంది : ఒక్కటై సాగుదాం..ఒక్కటిగా ఎదుగుదాం
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, సలహాదారు శ్రీధర్ లంక, తదితరులు పాల్గొన్న ఈ సమావేశాలలో మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులతోపాటు సమాజం వృద్ధి చెందే పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది మరోసారి నొక్కి చెప్పారు. ప్రధాని నిర్దేశించిన 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో ఏపీది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. లక్ష్యాలు చేరుకోవడంలో, సవాళ్ళను అందుకోవడంలో ఏపీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. పారిశ్రామికాభివృద్ధిలో “ఒక్కటై సాగుదాం.. ఒక్కటిగా ఎదుగుదాం” అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీని ఈవీతో ఆధునీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యవసరమైన ఛార్జింగ్ వంటి సదుపాయాలను మరింతగా విస్తరిస్తామన్నారు. ఇప్పటికే కియా మోటార్స్ సంస్థ లాంటి విద్యుత్ వాహనాల తయారీ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ సొంతమని మంత్రి ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజారవాణా వ్యవస్థను ఈవీగా ఆధునీకరిస్తామని చెప్పారు. 5వేలకు పైగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సులను విద్యుత్ నడిచేలా తీర్చిదిద్దుతామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఏపీని చిరునామాగా మారుస్తామన్నారు. రవాణా వ్యవస్థను ఈవీగా మార్చేందుకు మౌలిక వసతులే ముఖ్యమని చెప్పారు.మౌలిక వసతులు, సహజవనరులు పుష్కలంగా కలిగిన ఏపీ..పెట్టుబడులకు స్వర్గధామమని మంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, సదుపాయాలతో అనుకున్న వృద్ధి, ఉపాధి సాధిస్తామన్నారు.