లక్నో కోర్ట్ వద్ద బాంబు పేలుడు.. పరుగులు తీసిన జనాలు..
గత కొంత కాలంగా దేశంలోకి దాయాది దేశానికి చెందిన ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పపడుతున్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత మరికొన్ని దాడులకు పాల్పపడతామని హెచ్చరికలు కూడా చేస్తున్నారు ఉగ్రమూకలు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముఖ్య ప్రదేశాల్లో గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఎక్కడో అక్కడ బాంబ్ బ్లాస్టులు జరుగుతూనే ఉన్నాయి. అంతే కాదు ఇంటిలీజెన్స్ వర్గాలు సైతం అన్ని రాష్ట్రాలకు ఉగ్ర మూక నుంచి.. ఇతర అసాంఘీక శక్తుల నుంచి ప్రమాదాలో పొంచి ఉన్నాయని హెచ్చరికలు జారగీ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ కోర్టు వద్ద బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ పేలుడులో ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. అణువణువు గాలించారు. మరో మూడు పేలని బాంబ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు జరిగిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు కూడా జరిపారని తెలుస్తోంది. ఈ బాంబు పేలుడు ఘటనపై న్యాయవాది సంజీవ్ లోధీ స్పందిస్తూ.. జితు యాదవ్ అనే న్యాయవాది తనను లక్ష్యం చేసుకుని ఈ దాడి చేశాడని ఆరోపించారు. కాగా, ఈ దాడి ఇద్దరు న్యాయవాదుల మధ్య వైరమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. న్యాయవాది సంజీవ్ లోధీని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం.
బాంబు పేలుళ్లకు కొద్ది సేపటిముందే లోధీపై దాడి కూడా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లోధి ప్రస్తుతం లక్నో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మరోవైపు ఘటనపై వజీర్గంజ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. పేలుళ్లకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని జీతు యాదవ్గా గుర్తించారు.