బాబోరిపై పవన్ కు ఉన్నది భక్తా.. గౌరవమా.. అంతకుమించా?
ఆంధ్రప్రదేశ్ లో ముక్కోణపు రాజకీయ చదరంగం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన తమతమ స్థాయిల్లో పావులు కదుపుతున్నాయి. వీరిలో వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే.. టీడీపీ, జనసేన మాత్రం కలిసి వైసీపీపై పోరాడుతున్నాయి. జగన్ ను ఎదుర్కొనేందుకు చంద్రబాబుకు పవన్ ఉడతాసాయం అందిస్తున్నాడనే వాదనలు వినవస్తున్నాయి. రాజకీయంగా తాను బలపడాలని చేస్తున్న ప్రయత్నంలో తనకు తెలీకుండానే మళ్లీ చంద్రబాబునే బలపరుస్తున్నాడని అంటున్నారు. పరిస్థితులు చూస్తే ఇదే విషయం అర్ధమవుతోందని చెప్పాలి.
2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ చేసిన సాయాన్ని చంద్రబాబుతో సహా ఆపార్టీ వారు రెండేళ్లలోనే మర్చిపోయారు. టీడీపీకి పవన్ చేసిందేమీ లేదని బాహాటంగానే చెప్పిన నాయకులున్నారు. చంద్రబాబు కూడా వారిని వారించింది లేదు. 2018 మార్చిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీతో విబేధించి చంద్రబాబు, లోకేశ్ ను దూనమాడారు. అది నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ.. ఏడాది ముందే ఎన్నికల స్టంట్ మొదలెట్టేశారని తర్వాత రోజుల్లో అర్ధమైంది. ఎన్నికల సమయంలో మంగళగిరిలో పవన్ ప్రచారం చేయకోవటం, గాజువాకలో చంద్రబాబు ప్రచారం చేయకపోవటం వీరి లోపాయకారి ఒప్పందాన్ని తెలియజేస్తున్నాయి.
టీడీపీలో తనను బ్లాక్ మెయిలర్ అంటున్నారని పవనే ఓ సందర్భంలో చెప్పాడు. ఇంత జరిగినా ఇప్పుడు మాత్రం మళ్లీ టీడీపీని మోస్తున్నట్టే ఆయన వ్యవహారం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగి చంద్రబాబు, లోకేశ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై పవన్ మాట్లాడటం లేదు. పైగా రాజధాని అంశంపై అమరావతిలో పర్యటిస్తూ ఉపన్యాసాలిస్తున్నాడు. ప్రజల అటెన్షన్ మరల్చటానికే పవన్ ప్రయత్నాలు అంటూ విమర్శలు వస్తున్నాయి. టీడీపీలో తాను పడ్డ అవమానాలు మరిచి మళ్లీ వారితో స్నేహ హస్తం చాటుతున్న పవన్ ను ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధంకాని పరిస్థితి.