మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రిజర్వేషన్లలో మార్పులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులుకు మరింత ఆసరా ఇచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం వారికి 3 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా, తాజాగా జగన్ సర్కార్ ఒక్క శాతం పెంచి.. మొత్తం నాలుగు శాతంగా ఖరారు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అంధత్వం, చూపు మందగించడం వంటి సమస్యలు ఉన్నవారికి 1 శాతం.. మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మరగుజ్జుతనం, యాసిడ్ దాడి బాధితులకు 1 శాతం, వినికిడి లోపం ఉన్నవారికి 1 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఇక లెర్నింగ్ డిసెబిలిటీ, ఆటిజం వంటి సమస్యలతో బాధపడేవారికి సైతం 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా 5గురికి మించి స్టాఫ్ ఉంటే అక్కడ ప్రమోషన్స్లోనూ ఇదే తరహా రిజర్వేషన్లు అమలుకానున్నాయి. జగన్ నిర్ణయంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో ప్రతీ ఒక్కరు అభివృద్దిలో భాగస్వాములవుతున్నారని ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో పలువురు జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని మార్పు విషయంలో ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.