వాట్సాప్, టిక్ టాక్ లపై క్రిమినల్ కేసు నమోదు..?
ఈ మధ్యకాలంలో జనాలు ఆన్లైన్ ప్రపంచంలో బతికేస్తున్నారు. ముఖ్యంగా మనుషులతో మాట్లాడడం మానేసి స్మార్ట్ పోన్లతోనే మాట్లాడుతున్నారు.ఇక స్మార్ట్ ఫోన్ సర్వస్వంగా బతికేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ మంది నెటిజన్లు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు నెటిజన్లను ఆకర్షించేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త యాప్స్ తెరమీదికి వస్తుండడంతో నెటిజన్లు రోజురోజుకి సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలోని కొన్ని యాప్స్ పై కేసు నమోదైంది. దేశంలోనే తొలిసారిగా టిక్టాక్ వాట్సాప్ సహా పలు యాప్స్ యాజమాన్యాలపై కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మతపరమైన వీడియోలు ఉద్దేశపూర్వకంగానే... సోషల్ మీడియాలోని పలు యాప్స్ లో వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం దాఖలు చేసిన పిటిషన్ పై ... సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు... కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఇండియన్ టిక్ టాక్ వాట్సాప్ గ్రూపులో పాకిస్థాన్ కు చెందిన వారు కూడా ఉన్నారు అంటూ పిటిషనర్ శ్రీశైలం తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సి వ్యతిరేకిస్తున్న వీడియోలు పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులు పెడితే ఇండియాలో పెట్టినట్లుగా వైరల్ చేస్తున్నారని శ్రీశైలం తన పిటిషన్లో పేర్కొన్నాడు.
ఇక పిటిషనర్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం దాఖలుచేసిన ఆధారాలు పై సుదీర్ఘ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు... పిటిషనర్ సమర్పించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులను సూచించింది. ఇక రెండు రోజుల్లో టిక్ టాక్ వాట్సాప్ యాజమాన్యాలకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ యాప్ యాజమాన్యాలపై 153a, 121a, 294, 505, 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.