రేవంత్ రెడ్డిని భలే ఇరికిస్తున్నారే...కేసీఆరా మజాకా?
హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన గోపన్పల్లి భూ ఆక్రమణల ఆరోపణల పేరుతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై అధికార పార్టీ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వెనెంబర్ 127 సంబంధించిన ల్యాండ్ కేసులో రేవంత్పై అభియోగాలు నమోదు చేశారు. అక్రమంగా మ్యుటేషన్ చేసిన అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డిని సస్పండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ల్యాండ్ కు సంబంధించి ఇప్పటికీ తామే నిజమైన యాజమానలంటూ కొందరు ముందుకు వచ్చారు. సదరు రాజోలు సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.
2016 లో గచ్చిబౌలీ పోలీసులకు పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా...గచ్చిబౌలీ పోలీసులు చార్జీ షీట్ వేశారు. ఈ ల్యాండ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చిన పోలీసులు ఆయనతో పాటు పాటు కొండల్ రెడ్డి,లక్ష్యయ్య పేర్లను కూడా చార్జీ షీట్ లో చేర్చారు. కొండల్ రెడ్డిపైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. 2016 లోనే నమోదైన ఈ కేసులో పోలీసులు 2019 లో చార్జీషీట్ దాఖలు చేసి కోర్టుకు సమర్పించారు.
కాగా, తాజాగా రాజోలు సొసైటీ భూమిని రేవంత్ రెడ్డి, కొండాల్ రెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు చేస్తూ సభ్యులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. కబ్జాను అడ్డుకున్నందుకు రేవంత్ రెడ్డి, కొండాల్ రెడ్డి తమను బెదిరించారంటూ ఆరోపించారు. గోపన్ పల్లి సర్వే నెంబర్ 127లో రాజోలు సొసైటీ పేరుతో నాలుగున్నర ఎకరాలు కొనుగోలు చేశామని, 2014లో ల్యాండ్ తమదంటూ రేవంత్ రెడ్డి, కొండాల్ రెడ్డి సొసైటీ సభ్యులను బెదిరించారని, ఆ భూమిలో మొత్తం 125 మంది సొసైటీ సభ్యులు కట్టుకున్న రూములను కూలగొట్టడంతో పాటుగా సొసైటీ భూమికి దారి లేకుండా అడ్డుగా గోడ కట్టారని తెలిపారు. మధ్యతరగతికి చెందిన తాము ఒక్కొక్క రూపాయి పోగు చేసి భూమిని కొనుగోలు చేసినట్లు రాజోలు సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కొండాల్ రెడ్డి… రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశాని వాపోయారు. కులం పేరుతో దూషించడంతోపాటుగా ఏండ్లుగా వేధిస్తున్నారని వివరించారు. రాజోలు సొసైటీ భూమిని అసలు హక్కుదారులైన తమకు ఇప్పించాలని కోరారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళను కలిసి రాజోలు సొసైటీ సభ్యులు ఆధారాలు సమర్పించారు.