కరోనా ఉన్నట్లు రుజువైతే లక్ష ఇస్తారట.. అసలు విషయం ఏంటంటే..?
చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్(కోవిడ్ 19) ప్రాణాంతకమైనది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్ నగరంలో మొదటిసారి కరోనా వైరస్ మనుషుల్లో బయటపడినప్పుడు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. త్వరలోనే ఈ వ్యాధి తగ్గిపోతుందనీ, ప్రపంచ దేశాలు టెన్షన్ పడాల్సిన పనిలేదని తెలిపింది. కానీ మూడు నెలల తర్వాత సీన్ చూస్తే... మొత్తం రివర్స్ అయింది. ఏకంగా 57 దేశాలకు పాకిన కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా 83,877 కేసులు నమోదు కాగా.. అందులో 2,869 మంది మృతి చెందారు. మిగతా 44,194 మంది చికిత్స పొందుతున్నారు.
ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఈ వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పుకూలుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్థం అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇక చైనా లో కరోనా బారిన పడి రోజుకు ఎంతమంది చనిపోతున్నారో.? కొత్తగా ఎంతమందికి ఈ వైరస్ వ్యాపిస్తోందో.? ఎప్పుడు అదుపులోకి వస్తుందన్న విషయాలు ఏవి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడి అధికారులు.
ప్రస్తుతం చైనా లోని అన్ని ప్రాంతాలూ డెడ్ సిటీస్గా మారిపోయాయి. అక్కడి అధికారులు కరోనాను నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. ఆ వైరస్కు భయపడి ప్రజలు ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారట. ఈ క్రమంలోనే చైనా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటే.. వారికి ఆ వైరస్ ఉన్నట్లు రుజువైతే 10000 యువాన్లలు అంటే ఇండియన్ కరెన్సీలో లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇలా అయినా కొంత మేరకు కరోనా నుండి ప్రజలను రక్షించవచ్చు అనే ఉద్దేశంతోనే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.