గుంటూరు టీడీపీలో ఫైటింగ్... బాబుకే ఆ సీనియర్ అల్టిమేటం... !
ఏపీలో అసలే అధికారం కోల్పోయి ప్రజల్లో అభిమానం కోసం ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతోన్న టీడీపీని రోజుకో కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీకి దాదాపు 30 నియోజకరవర్గాల్లో పార్టీని ముందుండి నడిపించే నేతలు లేకుండా పోయారు. ఇప్పుడు ఈ 30 నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నేతలను ఎలా సెట్ చేసుకోవాలో తెలియక చంద్రబాబు తీవ్రంగా సతమత మవుతున్నారు. ఇక ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జ్ల నియమిస్తున్నారు. ఈ నియామకాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇప్పటికే వంగలపూడి అనితను తిరిగి పాయకరావుపేట ఇన్చార్జ్గా నియమించడంతో అక్కడ నేతలు భగ్గుమంటున్నారు. ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు కో ఆర్గినేటర్గా జనాలు అందరూ మర్చిపోయిన నేత మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను నియమించడంతో ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే జిల్లాలోని సత్తెనపల్లి ఇంచార్జ్గా వంగవీటి రాధాను వేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కూడా గొడవలు జరిగే అవకాశం కన్పిస్తోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పోటీ చేసి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ నుంచి ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ పోస్టు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు ఈ పదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల తర్వాత కోడెల వర్గంతో రాయపాటి రంగారావు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు ఈ రెండు వర్గాలను కాదని చంద్రబాబు విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటిని విజయవాడ నుంచి తీసుకురావడం ఇక్కడి నేతలకు నచ్చడం లేదట.
ఇక రాయపాటి పదవి మాకు ఇస్తారా ? లేదా అని బాబుకే అల్టిమేటం ఇచ్చినట్టు టాక్.. ? ఇటు గన్నవరం ఇంచార్జ్పై ఇంకా తేల్చలేదు. జడ్పీ మాజీ ఛైర్మన్ గద్దె అనురాధను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చాలా మంది నేతలు పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారట. ఏదేమైనా కొత్త ఇన్చార్జ్ల నియామకం టీడీపీలో పెద్ద కుదుపునకు కారణమయ్యేలా ఉంది.