పవన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నాడు ? ఎవరిని కలుస్తున్నాడు ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, వ్యవహారశైలి గాని ఎవరికీ అంతుచిక్కని విధంగా ఉంది. జనసేన పార్టీ పెట్టింది మొదలు ఇప్పటివరకు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పవన్ వ్యవహరించ లేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందినా పవన్ లో మార్పు అయితే కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కానీ, నిత్యం ప్రజల్లో ఉంటూ.. ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూ, పార్టీ నాయకులను, ప్రజలను ఉత్సాహపరచాల్సిన పవన్ అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల వైపు చూస్తూ, మిగతా సమయంలో సినిమాలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. మొదటి నుంచి ఇదే తంతు నడుస్తోంది.
ఏ ప్రజా సమస్య అయినా, పూర్తిస్థాయిలో పోరాడకుండా మధ్యలోనే వదిలివేయడం పవన్ కు పరిపాటిగా మారింది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, పవన్ వ్యవహార శైలిలో మార్పు కనిపించడంలేదు. ఒకపక్క సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే, మరో పక్క రాజకీయాలపై కూడా దృష్టి పెడుతున్నారు. బీజేపీతో పొత్తు తరువాత అమరావతి రైతులకు మద్దతుగా అక్కడకు వెళ్లారు. ఆ తర్వాత కర్నూల్ లో అత్యాచార బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని ఆందోళన చేపట్టారు. పవన్ ఇక అప్పటి నుంచి కనిపించకుండా అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మధ్య కాలంలో ఆయనకి ఢిల్లీకి వెళ్లడం ఇది నాలుగోసారి. అయితే పవన్ ఢిల్లీ కి ఎందుకు వెళ్తున్నారు ? అక్కడ ఈ విషయాలపై చర్చిస్తున్నారు ? ఏ ఏ నాయకులను కలుస్తున్నారు అనేది తెలియడం లేదు.
శుక్రవారం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన పవన్ మోదీ , అమిత్ షా వంటి అగ్ర నేతలను కలవలేక పోతున్నారు. మిగతా వారిని కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో బిజెపితో పొత్తు అనగానే పార్టీ బాగా బలం పుంజుకుంటుందని, పవన్ ఏపీలో చక్రం తిప్పుతారని జనసేన పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు కలిసి ఒక కార్యక్రమం కూడా చేపట్టలేదు. విజయవాడలో నిర్వహించాల్సిన లాంగ్ మార్చ్ కూడావాయిదా పడింది. ఢిల్లీ వెళ్లిన పవన్ ఏ అంశాల గురించి చర్చిస్తారు. అసలు ఎందుకు వెళ్లారు అనేది ఆ పార్టీ కీలక నాయకులు కూడా సమాచారం లేదు. దీంతో అసలు పవన్ ఏం చేస్తున్నాడు ? ఎందుకు చేస్తున్నాడు? అని జనసేన నాయకుల్లోనే అనేక సందేహాలు సమాధానం లేకుండా ఉండిపోయాయి.