తెలుగు రాజకీయాల్లో ఓరుగల్లు పోరుబిడ్డే ఈ ఫైర్బ్రాండ్ సురేఖ..!
ముందుగా గీసుకొండ మండల పరిషత్ నుంచి ఎంపీపీగా గెలిచిన సురేఖ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖర్ రెడ్డి అండదండలతో అప్పటి శాయంపేట నియోజకవర్గం నుంచి 1999లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 2004లో మరోసారి గెలిచిన సురేఖ 2009లో శాయంపేట రద్దవ్వడంతో పరకాల నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణ మహిళా నాయకుల్లో చాలా తక్కువ మంది మాత్రమే హ్యాట్రిక్ కొట్టిన వాళ్లు ఉండగా వారి సరసన సురేఖ ఉండడం అరుదైన విషయం.
ఉన్న విషయాన్ని ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఆమె మనస్తత్వమే ఆమెను తెలుగు రాజకీయాల్లో ఓ ఫైర్బ్రాండ్ లీడర్ను చేసింది. ఆ తర్వాత వైఎస్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. వైఎస్ మరణాంతరం సైతం ఆమె రాజకీయంగా ఆ కుటుంబం వెంటే నిలబడాలని నిర్ణయించుకుని తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవి సైతం వదులుకున్నారు. 2012లో పరకాల ఉప ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఏకంగా 55 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఆ తర్వాత అక్కడ అవమానాలు ఎదురవ్వడంతో సురేఖ దంపతులు టీఆర్ఎస్ వీడి తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సురేఖ ఓడిపోయినా ఆమె రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. సురేఖ మాటే ఓ నిప్పు తూటాలా ఉంటుంది. ఆమె రాజకీయంగా దూకుడుగా ఉంటుందనడంలో సందేహం లేదు.