కడప ఫార్ములా అమలు చేస్తున్న బాబు...బొత్స సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాటలు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిలా లేవని వైసీపీ నేత, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ మండిపడ్డారు. ``ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ద లేదు. చంద్రబాబుకి సొంత పార్టీ, సొంత కుటుంబంపైనే శ్రద్ద`` అని మండిపడ్డారు.
కరోనాపై ఎంత అప్రమత్తంగా ఉన్నామో సీఎం వైయస్ జగన్ గవర్నర్ను కలిసి వివరించారని బొత్స తెలిపారు. ``ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఏవైనా అంశాలు వస్తే ప్రభుత్వ వివరణ అడగాలి. కానీ నాకున్న విచక్షణా అధికారంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఇలా చేయడం సరైనదా?`` అని ప్రశ్నించారు.
``కొన్ని రోజులక్రితం అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు శాసనమండలి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి శాసనమండలి వ్యవస్ధకి ఏ విధంగా మచ్చ తెచ్చారో ఇపుడు అలాగే జరిగింది. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకి బుద్ది లేదు. ఏపీ అభివృద్ది చంద్రబాబుకి ఇష్టం లేదు. నాడు శాసనమండలి చైర్మన్ అన్నట్టే నేడు రమేష్ కుమార్ తన విచక్షణాధికారం అంటున్నారు. ఎన్నికల కమిషన్ అధికారాలు ఏంటో మాకు తెలుసు. ఎన్నికలు ఆరు వారాలు వాయిదా వేయడానికి నీకున్న అధికారం ఏంటి? ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు అధికారం? కరోనా వైరస్ రాష్ట్రంలో ఉంటే నిన్న అధికారులతో ఎందుకు సమీక్ష చేయలేదు` అని బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు.
అధికారం ఎవరు ఇచ్చారని సీఎం వైఎస్ జగన్ను ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలా విమర్శిస్తారని బొత్స ప్రశ్నించారు. ``ప్రజలు ఇచ్చిన అధికారంతోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి నేడు ఎన్నో పథకాలతో సంక్షేమ పాలన అందిస్తున్నారు. నువ్వు అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. జివిఎంసి ఎన్నికలు 2007 తర్వాత ఎందుకు జరగలేదు...నువ్వు అధికారంలో ఉండగా ఎందుకు ఎన్నికలు జరిపించలేదు? వైఎస్సార్ గారి హయాంలో ఉండగా జివిఎంసి ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్ గారి మరణం తర్వాత కడప ఎన్నికలలో నువ్వు చేతులెత్తేసి కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేయమని చెప్పలేదా చంద్రబాబు? ఆ రోజు కాంగ్రెస్ కు నువ్వు మద్దతు పలికింది నిజం కాదా...శ్రీ వైఎస్ జగన్ మెజార్టీ గెలుపును అడ్డుకోగలిగావా. ఆ రోజు అధికారంలో ఉన్న మేము, నువ్వు కలిసినా కూడా వైఎస్ జగన్ ప్రజాధరణను అడ్డుకోగలిగామా? నీకు ప్రజాధరణ ఎక్కడుంది? అలాంటి ప్రజాదరణను ఇప్పటికైనా ఆపివేస్తే మంచిది``