కరోనా నుండి కోలుకున్న బాధితుడి అనుభవాలు..?
భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకి చాలా మంది ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డుల్లో ప్రత్యేకంగా చికిత్స అందుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ పై అటు ప్రభుత్వం ఎన్ని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ... కొంతమంది ప్రజల్లో మాత్రం కరోనా వైరస్ పై ఇప్పటికీ భయాలు మాత్రం పోలేదు. కరోనా వైరస్ సోకితే చని పోవడం ఖాయం అని భయపడి పోతున్నారు. అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడిన వ్యక్తి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కరోనా సోకినా సమయంలో తన అనుభవాలను తెలిపి అందరిలో ధైర్యాన్ని నింపాడు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో రెండు వారాలుగా చికిత్స పొందుతున్న 45 ఏళ్ల రోహిత్ దుత్త అనే వ్యక్తి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని నిన్న రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన సదరు కరోనా బాధితుడు... కరోనా వైరస్ సోకిన సమయంలో తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తనకు కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరారని... ఇక ఆ తర్వాత తనకు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ సోకింది అని తెలియగానే ఆందోళన చెందినట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత డాక్టర్ల వైద్యం తో తనకు ఎంతో నమ్మకం కలిగింది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి గురించి ఎవరు భయపడాల్సిన పనిలేదని.. వైరస్ ను ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు మనదేశంలో ఉన్నాయి అంటూ తెలిపాడు రోహిత్ దుత్త.
కరోనా వైరస్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఎవరు భయాలకు లోను కావద్దు అని సలహా ఇచ్చాడు. అయితే కరోనా పెషేంట్ లకు ప్రత్యేకమైన చికిత్స అందించేందుకు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే బాగున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. గత నెల 24న యూరోప్ నుంచి ఢిల్లీకి వచ్చిన సమయంలో తీవ్రమైన జ్వరం జలుబు దగ్గు తో బాధ పడ్డాను అంటూ తెలిపిన రోహిత్... మొదటి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరగా... తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చేరాలని సూచించారు అంటూ తెలిపాడు. తనకు కరోనా వైరస్ లక్షణాలున్న సమయంలో ఢిల్లీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని తెలిపాడు. ఇక అప్పటికే తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. తర్వాత రిపోర్ట్ లో తనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే మొదట్లో కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ కాగానే ఎంతో భయాందోళనకు గురయ్యాను అంటూ చెప్పుకొచ్చిన రోహిత్ దుత్త .. తనకు ఢిల్లీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వైద్యులు ఎంతో భరోసానిచ్చారు తెలిపారు. అంతేకాకుండా ప్రధాని మోడీ సహా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రోజు పరిస్థితిని సమీక్షించారు అంటూ తెలిపాడు . అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని.. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ తెలిపారు. కాగా ఇప్పుడు వరకు ఢిల్లీలో ఆదివారం నాటికి కరోనా వైరస్ తో బాధపడుతున్న ఇద్దరు బాధితులు కోలుకునీ డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 107 కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే.