అధిష్ఠానంపై ఆ ఎమ్మెల్యే అలక
ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ టీఆర్ ఎస్ అధిష్ఠానంపై అలక వహించారట. సింగరేణి సంస్థ యాజమాన్య పరిధిలో పనిచేసే బొగ్గు రవాణా కాంట్రాక్టర్ను బెదిరింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే దంపతులను హైదరాబాద్కు పిలుపించుకుని మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా కేటీఆర్ మీరు ఎమ్మెల్యే..మీ వారు కాదంటూ సూటిగా స్పష్టంగా హెచ్చరించడంతో వారు నొచ్చుకున్నారట. ఎలాంటి తప్పుచేయకుండా, ఎలాంటి ఆధారాల్లేకుండా తమను ఇలా నిందించడం ఏంటని ఎమ్మెల్యే దంపతులు మనస్తాపానికి గురవుతున్నట్లుగా నియోజకవర్గ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది.
గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై ఆమె విజయం సాధించారు. అయితే గెలిచిన కొద్ది రోజుల్లోనే ఆమె కారెక్కారు. ఆమె అనుచరులు చాలా మంది వారిస్తున్న భర్త మాట కాదనలేక కాంగ్రెస్ టాటా చెప్పి కారెక్కేశారు. పార్టీలో చేరే ముందు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు అనేక హామీలిచ్చారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యం కల్పించడం లేదని ఆమె అనుచరులు వాపోతున్నారు. పైగా ఆమెపై ఓడిన కనకయ్యకు జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించడం, మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ బిందు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బయ్యారం మండలానికి చెందిన నాయకురాలే కావడం, మంత్రి సత్యవతిరాథోడ్ అక్క బిడ్డ కావడంతో హరిప్రియకు రాజకీయ కష్టాలు ఎక్కువయ్యాయి,.
పెద్దగా చెప్పుకో దగిన స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు దక్కకపోవడంతో ప్రజానీకం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆమె సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన నియోజకవర్గంలో కోరం అటు కోరం కనకయ్య..ఇటు సత్యవతిరాథోడ్, ఆమె అక్క కూతురు బిందు జోక్యం అధికమవుతోందన్న బాధ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పలుమార్లు పలుమార్లు కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదని మనస్తాపం చెందిందట. పైగా ఇటీవల సింగరేణి కాంట్రాక్టర్ వివాదం మరింత తలనొప్పిగా మారిందన్న భావనతో దంపతులిద్దరూ ఉన్నారట. కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశామా అన్న ఆలోచనతో వారు మదనపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.