కరోనా బూచి : దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు..?
భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. భారత్లో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోయేలా కనిపిస్తుంది. ఇక ఈ వైరస్ కు సరైన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఈ వైరస్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారు వైద్య నిపుణులు. ఇక ఈ వైరస్ విజృంభన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తెస్తున్నాయి. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా స్తంభించిపోయింది. భారత చరిత్రలోనే మొదటిసారి అధికారికంగా ఇలా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది గమనార్హం.
రైళ్లు బస్సులు విమానాలు కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. రైల్వే వ్యవస్థ ప్రారంభమై 174 ఏళ్లు, రాష్ట్రంలో బస్సు రవాణా వ్యవస్థ మొదలైనవి ఎనిమిది దశాబ్దాల అయ్యింది. ఇన్నేళ్ళలో రవాణా వ్యవస్థ ఇంత దారుణంగా స్తంభించి పోవడం ఇదే మొదటిసారి. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో పూర్తిగా దేశం మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఈ జనతా కర్ఫ్యూను మార్చి 31 వరకూ కొనసాగిస్తూ తెలంగాణ సర్కారు తీసుకొన్న నిర్ణయం సంచలనంగా మారిపోయింది. పూర్తిగా లాక్ డౌన్ చేయడంతో మార్చి 31 వరకూ అంటే 9 రోజులు ప్రజారవాణా ఏది అందుబాటులో ఉండదు.
అయితే ఇప్పటి వరకూ సమ్మెలు, ఉద్యోగుల బహిష్కరణ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు రవాణా ను అడ్డుకుని నిలిపి వేయడం జరిగింది కానీ మొదటిసారిగా అధికారికంగా ప్రభుత్వమే ప్రజా రవాణాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలోనూ కరోనా వైరస్ వంటి మహమ్మారి వైరస్ లు బయటపడ్డప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో... ఇలాంటి కఠిన ఆంక్షలు అమలులోకి తేవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోవడం.. ఈ వైరస్ కు వాక్సిన్ కూడా లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం కావడంతో ఇలాంటి సంచలన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోక తప్పలేదు. హైదరాబాద్లో ఉన్న మొత్తం 121 ఎంఎంటీఎస్ రైళ్లు మార్చి 31 వరకు నిలిపివేయనున్నారు. ఇక రోడ్డు రవాణా సంస్థ కూడా పూర్తిగా బంద్ అయింది. ఇక మొత్తంగా దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 744 రైళ్లు నిలిపి వేయగా... తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలు 9600 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.