అంతు చిక్కని మిస్టరీ అదే ...
ఢిల్లీ లో ఇటీవల జరిగిన ఒక మత సభకు వెళ్లి వచ్చిన వారిలో చాలామందిని అధికారులు కరోనా బాధితులుగా గుర్తించారు . దీనితో సదరు సభకు హాజరయి వచ్చిన వారిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి . ఇక తెలంగాణలో మృతి చెందిన తొలి కరోనా బాధితుడు కూడా ఆ సభకు వెళ్ళివచ్చినట్లు అధికారులు వెల్లడించారు . తెలంగాణ నుంచి అతనితోపాటు ఇంకా ఎంతమంది ఈ సభకు హాజరయ్యారన్నదానిపై అధికారులు ఆరా తీసే పని లో నిమగ్నమయ్యారు . ఇక ఈ మత సభ కు దేశ వ్యాప్తంగా వేలాది మంది హాజరయినట్లు తెలుస్తోంది .
అయితే వీరంతా రైళ్లలోనే ప్రయాణం చేసినట్లుగా అధికారులు గుర్తించారు . దేశ రాజధాని నుంచి వివిధ ప్రాంతాలకు రైలులో చేరుకోవడానికి దాదాపు 12 నుంచి 36 గంటల వరకు సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు . ఈ లెక్కన వీరిలో కొంతమంది 36 గంటలపాటు, ఇతరులతో కలిసి సామూహిక ప్రయాణాలు చేశారన్న వార్తే ఇప్పుడు అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది . కరోనా బాధితుని తో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలామందికి ఈ వ్యాధి సోకే అవకాశముండడం అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది . సదరు మతసభకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా బాధితులయిన వ్యక్తులతో కలిసి , ఎంతమంది ఆ రోజు రైలు ప్రయాణం చేశారన్నది అంతుచిక్కని మిస్టరీ గా మారింది .
మతసభకు వెళ్లివచ్చిన వారిలో ఎంతమంది కరోనా బాధితులో తెలుసుకునే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు . ఆ తరువాత వారు ప్రయాణించిన రైళ్ల వివరాలను తెలుసుకుని , ఆ రోజు ప్రయాణించిన వారి వివరాలు సేకరించవచ్చునని భావిస్తున్నారు . ఇక సదరు సభ కు వెళ్లి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై గురించి అధికారులు వాకబు చేస్తున్నారు . ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్ గా తేలిన వారికి చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు .