ఆ విషయంలో ట్రంప్కు మోడీ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా..!
ట్రంప్.. ఈ ప్రపంచానికి పెద్దన్న.. ప్రపంచంలో ఏమూలన శత్రువు దాక్కున్నా.. గుంజుకొచ్చిమరీ అంతం చేయగల అగ్రరాజ్యానికి అధినేత. కానీ.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మరి. పాపం! ఇప్పుడు ఆయనకు పెద్దకష్టం వచ్చిపడింది. ఎప్పుడు ఇతర దేశాధినేతలను ఆదేశించడం నుంచి అభ్యర్థించే స్థాయికి దిగొచ్చారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19 అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలో రోజూ వందల మంది మరణిస్తున్నారు. ఇప్పటికే లక్షమందికిపైగా వైరస్ బారినపడ్డారు. అయితే.. ఓ మందు కోసం భారత్ ప్రధాని మోడీని ట్రంప్ అభ్యర్థించారు. ఫోన్ చేసిమరీ తమకు సాయం చేయాలని కోరారు. కానీ.. ప్రధాని మోడీ కూడా సందుజూసి షాక్ ఇచ్చారు. ఆ మందును పంపించకుండా మరింత కఠినంగా నిబంధనలను మార్చేసి తనమార్క్ను చూపించుకున్నారు. ఇంతకీ ఏమిటా మందు అని అనుకుంటున్నారా.. ఇక సూటిగా విషయం దగ్గరకు వచ్చేద్దాం.. ఈ నెల 4వ తేదీన మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. భారత్లో తయారవుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ను తమ దేశానికి పంపించాలని అభ్యర్థించారు.
కరోనా బాధితులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ను వాడేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోంది. దీనిని ఉపయోగించుకుని కరోనాకు మందును కనిపెట్టాలన్నది ట్రంప్ ఆలోచన. ఇప్పటికే ప్రాథమికంగా న్యూయార్క్లో 1,500 మంది రోగుల చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఇతర మందులను కలిపి వాడగా మంచిఫలితాలు వచ్చాయి. దీంతో ఈ మందును పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాలన్నది ట్రంప్ ఆలోచన. ఆ క్రమంలో తమ దేశ సంస్థలు ఆర్డర్ ఇచ్చిన మేరకు టాబ్లెట్ల ఎగుమతికి అనుమతి ఇవ్వాలని ట్రంప్.. మోదీని అభ్యర్థించారు. ఈ విషయాన్ని వైట్హౌస్ వద్ద ట్రంప్ స్వయంగా తెలిపారు. కానీ, ట్రంప్ చెప్పిన కొద్ది గంటల్లోనే భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతి, ఫార్ములాకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల మినహాయింపులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ డ్రేట్ తక్షణమే రద్దు చేసింది. వాస్తవానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిని భారత్ మార్చి 25నే నిలిపివేసింది. అయితే, ‘మానవతా దృక్పథం’ కోణంలో మినహాయింపు ఇచ్చింది. కానీ, దేశంలో పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుండటంతో శనివారం దీనిని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.