కరోనాపై పోరాటం...తెలంగాణ సర్కారు ఇంకో ముందడుగు
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు క్రియాశీలంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ పరంగా, అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ పరంగా పలు నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా సోషల్మీడియా వేదికనూ వాడుకునేందుకు కార్యాచరణ తెచ్చింది. కోవిడ్-19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు వాట్సాప్ చాట్బాట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చాట్బాట్ ద్వారా వివరాలు తెలుసుకోవాలనుకునే వారు కింది లింక్ను క్లిక్ చేయండి.
https://wa.me/919000658658?text=Hi
Hi..అని మెసేజ్ పంపంగానే..
తెలంగాణ ప్రభుత్వ కరోనా (కోవిడ్-19) వాట్సాప్ చాట్ బాట్ కి స్వాగతం!
కరోనా వైరస్ గురించి ప్రాథమిక సమాచారం, దాని నుండి సంరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న సమాచారం, సేవలను ఈ చాట్ బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. అని సందేశం వస్తుంది.
కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను పొడిగించాలని ప్రధాని మోదీని కోరుతానని అన్నారు. మన దేశానికి లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు అని తేల్చిచెప్పిన కేసీఆర్ ఇండియాలో జూన్ 3 వరకు లాక్డౌన్ పాటించాలని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతిపాదించని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని సీఎం కేసీఆర్ అన్నారు. లాక్డౌన్ సడలించడమంటే అంత ఆషామాషీ కాదని...లాక్డౌన్ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని హితవు పలికారు. ప్రజలను బతికించుకోవాలంటే లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదని ఒక వేళ లాక్డౌన్ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోక తప్పదు అని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి రోజుకు రూ. 400 నుంచి రూ. 430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్డౌన్ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.