ఆ మందుతో 48 గంటల్లోనే కరోనా వైరస్ను చంపొచ్చు.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ను మట్టుబెట్టేందుకు ఇప్పటికీ ఎలాంటి మందులు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. వైరస్కు విరుగుడును కనిపెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రతోరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆశాజనకమైన వార్త శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తోంది. వైరస్ను చంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనేంక ప్రాథమిక దశలోనే ఉంటున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఆశాజనకమైన వార్త చెబుతున్నారు. ప్రాణాంతకమైన కొవిడ్-19ను ఇవర్మెక్టిన్ అనే మందు 48 గంటల్లోనే అంతం చేయొచ్చునని మొనాశ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన శరీరంలోని పరాన్న జీవులను చంపేందుకు ఈ మందును చాలాకాలంగా వాడుతుండగా ఆ శాస్త్రవేత్తలు దీన్ని కోవిడ్పై ప్రయోగించి చూశారు. అయితే.. ఇక్కడే వారి మంచి ఫలితం కనిపించింది.
పరిశోధన శాలలో పెంచిన కరోనా వైరస్పై ఇవర్మెక్టివ్ మందును ప్రయోగించినప్పుడు ఒకే ఒక్క డోస్తో వైరస్ 48 గంటల్లో చనిపోయిందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ కైల్ వాగ్స్టాఫ్ తెలిపారు. ఈ మందు పరిశోధనశాలలో కరోనా వైరస్తోపాటు డెంగీ, ఇన్ఫ్లూయెంజా, జికా, హెచ్ఐవీ వైరస్లపై కూడా ప్రభావం చూపిందని చెప్పారు. 24 గంటల తరువాతే ప్రభావం కనిపించడం మొదలైందని వాగ్స్టాఫ్ తెలిపారు. అయితే.. ఈ మందును అందుబాటులోకి తేవాలంటే మరిన్ని పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉందని, తాము కేవలం పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు చేశామని డాక్టర్ కైల్ వాగ్స్టాఫ్ తెలిపారు. అయితే ఈ మందును చాలాకాలంగా వాడుతున్న కారణంగా సురక్షితమైందని మాత్రం చెప్పవచ్చునని ఆయన తెలిపారు. కొవిడ్-19 బాధితులకు ఎంత మోతాడులో ఇవ్వాలన్న విషయంపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.