కరోనా పై యుద్ధం: కొవిడ్-1 కట్టడికి సీఎం జగన్ ముందస్తు ప్లాన్ ఇదే..!
ఏపీలో కరోనా వైరస్ కట్టడికి సీఎం జగన్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మహమ్మారిని తరిమికొట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూనే మరోవైపు బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ చికిత్స ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చిన సీఎం జగన్.. తాజాగా.. ముందస్తు ప్లాన్ను కూడా రూపొందించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పక్కా ఏర్పాట్లు చేపట్టింది అధికారయ యంత్రాంగం. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ టెస్టింగ్ పరికరాలు, బెడ్లు, మందులు, సిబ్బందిని పెద్ద ఎత్తున సిద్ధం చేసింది. రాష్ట్రంలో నాలుగు కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను గుర్తించింది. రాష్ట్రస్థాయి ఆస్పత్రులలో 444 ఐసీయూ బెడ్లు, 1,680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే 284 ఐసీయూ, 1,370 నాన్ ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. 13 జిల్లా కోవిడ్ ఆస్పత్రులలో 650 ఐసీయూ, 8950 నాన్ ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 334 ఐసీయూ, 6,662 నాన్ ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలోని ఒక్కో ఆస్పత్రిలో 100కు పైగా ఐసీయూ కెపాసిటీ, స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి ఆస్పత్రులలో 648 స్పెషలిస్ట్ డాక్టర్లు, 792 పీజీ డాక్టర్లు, 792 హౌస్ సర్జన్లు, 1152 నర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసింది. జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో 546 స్పెషలిస్ట్ డాక్టర్లు, 546 పీజీ డాక్టర్లు, 273 హౌస్ సర్జన్లు, 546 నర్సింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. వారం పాటు పనిచేసే సిబ్బందికి 14 రోజులు సెలవు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్క్లు, పీపీఈలు అందుబాటులో ఉంచింది. ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.