కరోనా వైరస్ వల్ల చావు దెబ్బ తిన్న దేశాల్లో ఇటలీ ఒకటి. టూరిస్ట్ ప్లేస్ కావడం తో వివిధ దేశాల నుండి విదేశీయులు రావడంతో కరోనా అక్కడ విలయ తాండవం చేసింది. ఎక్కడ చూసిన శవాలు గుట్టల తో ఇటలీ వణికిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాంతో ఇటీవల లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వగా మే 4 న పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేయనున్నారని సమాచారం. ఇప్పటివరకు ఇటలీ లో1,87000 కరోనా కేసులు నమోదు కాగా అందులో 25000కు పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇక ఇటలీ రేంజ్ లో కరోనా కు బలైన మరో దేశం స్పెయిన్ లో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుంది. దాంతో మే మూడు లేదా నాలుగో వారం లో అక్కడ లాక్ డౌన్ ను ఎత్తి వేయనున్నట్లుగా తెలుస్తుంది.
ఇక ఈరెండు దేశాల్లో కరోనా కేసులు తగ్గినా ఇండియాలో మాత్రం రోజు రోజుకు పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 21000 కేసులు నమోదు కాగా 700కు పైగా మరణాలు సంభవించాయి. ఇప్పటికే ఓ సారి లాక్ డౌన్ ను పొడిగించారు. వచ్చే నెల 3తో ఒక్క తెలంగాణ లో తప్ప దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగియనుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండడం తో మరో సారి లాక్ డౌన్ పొడిగించడం అనివార్యం అయ్యేలానే కనిపిస్తుంది. లాక్ డౌన్ గురించి ఈనెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మరో సారి చర్చించనున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో నిన్న కొత్తగా మరో 15కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 943కు చేరింది. అలాగే ఆంధ్రా లో నిన్న మరో 56కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 813 కు చేరింది. ఇక తెలంగాణ లో వచ్చే నెల 7 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.