లాక్ డౌన్ నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి . కేంద్రం ఒకవైపు సహాయం అందజేయడం మాట మర్చిపోయి , రాష్ర్టాల నుంచి పెట్రో ఉత్పత్తుల నుంచి పెద్దమొత్తం లో సెస్ రూపంలో దండుకునే ప్రయత్నాలు చేస్తోంది . లాక్ డౌన్ కు ముందు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టాల నుంచి సెస్ పెంచి వసూలు చేసుకునే బిల్లుని కేంద్రం ఆమోదించుకుంది .
దాన్ని ఇప్పుడు వినియోగం లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది .రాష్ర్టాల నుంచి దాదాపు లక్షా 60 వేలకోట్ల రూపాయలను పెట్రో ఉత్పత్తులపై సెస్ రూపం లో వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం . కరోనా కట్టడికోసంకేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయన్ని కోల్పోవాల్సిన పరిస్ధితి నెలకొంది . అయినా కేంద్రప్రభుత్వం మాత్రం , రాష్ర్టాలకు దన్నుగా నిలిచేందుకు తీసుకున్న చర్యలు ఏమీ లేవంటూ , విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయి .
కనీసం ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని పెంచామని కోరిన పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు . కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నది ప్రకటించకుండా చోద్యం చూస్తోందని ఆయన విరుచుకుపడ్డారు . అయితే , కెసిఆర్ కు పరిపాలన చేతకాక , కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కమలనాథులు ధ్వజమెత్తుతున్నారు .
కేంద్రం ఇప్పటికే లక్షా 70 వేలకోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు . అయితే కేంద్రం తాను ప్రకటించిన లక్షా డెబ్భై వేలకోట్ల రూపాయలప్యాకేజీ నిదులను కేంద్రం రాష్ట్రాల నుంచి తిరిగిరాబట్టుకునేందుకే పెట్రో ఉత్పత్తులపై సెస్ పెంచాలని భావిస్తోందని రాజకియ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .