వాహనదారుల్లో వర్రీ కలిగిస్తున్న ఈ–చలాన్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. !
అమ్మయ్య కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ నుంచి కాస్త ఉపశమనం లభించి స్వేచ్చ వచ్చిందని ఆలోచిస్తున్న వాహనదారులకు ఊహించని షాక్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఇంత కాలం హెల్మెట్ లేకుంటే లేదా, లైసెన్స్, పొల్యూషన్, ఆర్ సి బుక్ వగైరా లేకుంటే చలాన్ విధించే వారు.. కానీ ఇప్పుడు ఒక కొత్త రూల్ను అమలు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా నగరంలో ఉన్న చాలవరకు టూ వీలర్స్ కు సైడ్ మిర్రర్స్ అసలే ఉండవు.. చాలమంది స్టైల్ కోసమని ఈ అద్దాలు పెట్టుకోరు.. ఇప్పటివరకు ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లు ఊరుకున్నారు.. కాని ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ ట్రాఫిక్ అధికారులు ఈ–చలాన్లు విధిస్తున్నారు..
ప్రస్తుత పరిస్దితుల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని వాహనదారులు నిత్యావసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కుతున్న నేపధ్యంలో వారికి ‘సైడ్ మిర్రర్’లు వర్రీ కలిగిస్తున్నాయి. సైడ్మిర్రర్ లేనివాహనాలకు పోలీసులు ఈ–చలాన్ విధిస్తుండటమే ఈ ఆందోళనకు కారణం. ఇకపోతే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో వాహనదారుల్లో కలవరం మొదలైంది. ఇదిలా ఉండగా మోటార్ వెహికల్ యాక్ట్ 177 సెక్షన్ కింద సైడ్ మిర్రర్ లేకుంటే వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్పై నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిసారి రూ.100ల జరిమానా, రూ.35ల యూజర్ చార్జీలు కలిపి రూ.135లు చెల్లించాల్సి వస్తోందని కొందరు వాహనదారులు వాపోతున్నారు.. మరికొందరు పూర్తిస్థాయిలో వాహనదారులకు అవగాహన కలిగించాకా ఈ–చలాన్లు విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఇక బైక్లకు సైడ్ మిర్రర్లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందని, చలాన్లు విధించడం మంచిదే అని కొంతమంది పోలీసుల తీరును సమర్థిస్తున్నారు.
అయితే ఆర్టీఏ అధికారులు మాత్రం రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో భాగంగానే సైడ్ మిర్రర్లకు ఈ–చలాన్లు విధిస్తున్నామని పేర్కొంటున్నారు... కాబట్టి మీ వాహనాలకు సైడ్ మిర్రర్లు అమర్చుకోండి చలాన్ల నుండి తప్పించుకోండి..