వినియోగదారుల నెత్తిన కరెంట్ పిడుగులు.. మోతమోగుతున్న విద్యుత్ చార్జీలు... ?
సామాన్యుడి నుండి ధనవంతుడి వరకు అందరికి నిత్యావసరమైనది కరెంట్.. ఒక్క క్షణం కరెంట్ లేకుంటే అంతా అయోమయంగా ఉంటుంది.. అసలు తట్టుకునే స్దితి లేదు.. ఒక రకంగా మనిషి విద్యుత్కు బానిసగా మారిపోయాడు.. ఎందుకంటే మనిషి తన వాళ్లకంటే ఈ కరెంట్తోనే ఎక్కువగా జీవిస్తున్నాడు.. పొద్దునలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకోబోయే వరకు పక్కన ఎవరున్న లేకున్నా.. కరెంట్ మాత్రం తప్పని సరి.. ఇక ఈ లాక్డౌన్ సమయంలో గత రెండు నెలల నుండి విద్యుత్ బిల్లులు రావడం లేదు.. ఈ విషయంలో ప్రభుత్వాలు వినియోగదారులకు భారం పడకుండా చూస్తామని చెప్పాయి.. కానీ ఏపీలో విద్యుత్ బిల్లుల మోత ఆరంభం అయ్యింది..
సాధారణంగా వేసవిలో సహజంగా వచ్చే బిల్లుకు రెట్టింపు స్థాయిలో ఇప్పుడు కొత్త బిల్లులు వస్తుండటం, ఈ విషయమై విద్యుత్ సంస్థల కాల్సెంటర్లకు నిత్యం వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నా, సంబంధిత అధికారులు సైతం తమకేమీ తెలియదంటూ తప్పించుకుంటుండటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇకపోతే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏప్రిల్లో మీటర్ రీడింగ్ తీయలేదు. మార్చిలో ఎంత బిల్లు వస్తే అంతే బిల్లును ఏప్రిల్లో కూడా చెల్లించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి. కాగా చాలామంది వినియోగదారులు ఆ మేరకు బిల్లు చెల్లించారు. అలాంటివారికి కూడా ఇప్పుడు మే నెలలో రెట్టింపు బిల్లు వస్తోంది. ఈ విషయంలో ఏప్రిల్ నుంచి విద్యుత్ సంస్థలు నిశ్శబ్దంగా చార్జీలు పెంచేశాయని, దాని ఫలితమే ఈ బిల్లుల మంట అని విద్యుత్శాఖ వర్గాలు తెలిపాయి.
ఇక కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఒక నెలలో 225 యూనిట్లు దాటితే, వారంతా సి-కేటగిరీలోకి మారిపోతున్నారు. ఈ కేటగిరీలో విద్యుత్ చార్జీలు ఏప్రిల్ నుంచి భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా సీ-కేటగిరీ వినియోగదారులు పోయిన మార్చి వరకూ 300 యూనిట్లకు పైన ఎంత వాడినా యూనిట్ చార్జి రూ.7.75కు మించి ఉండేది కాదు. కానీ కొత్త విధానం ప్రకారం 300- 400 యూనిట్లు వాడినవారికి రూ.7.95, 400- 500 యూనిట్లకు రూ.8.30, 500 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్కు రూ.9.95చొప్పున చార్జి చేస్తున్నారు. ఈ కేటగిరీలో 300 యూనిట్లు లోపు వాడిన వారికి కూడా వివిధ విభాగాల్లో చార్జీలు పెరిగాయి. ఇకపోతే గతంలో 100- 200 యూనిట్ల వరకు రూ.3.60 ఉండగా ప్రస్తుతం రూ.5.40 కి పెరిగింది. అసలే కరోనా సమయంలో కరెన్సీ కష్టాలు చాలా ఉన్నాయి.. ఈ పరిస్దితుల్లో ఇలాంటి చర్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.. ఇక తెలంగాణాలో ఏవిధమైన ప్రణాళికను అవలంభిస్తారో వేచి చూడాలి..