కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న మండే ఎండలు..!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఈ వైరస్ పుట్టుక, వ్యాప్తి, నివారణకు సంబంధించిన అంశాలపై అనేక దేశాల్లో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇతర దేశాలు అమెరికా, ఇటలీ, రష్యా, స్పెయిన్, ఇరాన్ తదితర దేశాలతో పోల్చి చూస్తే.. భారత్లో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండడానికి కారణం ఏమిటన్న దానిపై ఆసక్తికరమైన విషయాలను కొందరు నిపుణులు వెల్లడించారు. భారత్లో ఎండలు ఎక్కువగా ఉండడం వల్లే.. అంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి కొంతమేరకు తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంటున్నారు. వేడి తీవ్రత వల్ల వైరస్ జీవించి ఉండే సమయం తగ్గుతుందని, దీంతో వ్యాప్తి ఎక్కువగా ఉండదని చెబుతున్నారు.
మనం మాట్లాడినప్పుడు నోటి నుంచి బయటకు వచ్చే తుప్పిర్లలో ఉండే వైరస్ వేడి తీవ్రత వల్ల ఎక్కువ సమయం జీవించి ఉండదని, అదే చల్లటి వాతావరణంలో ఎక్కువ సమయం జీవించి ఉంటుందని సూచిస్తున్నారు. నిజానికి.. ఈ విషయంలో గతంలోనే ప్రధాని మోడీ స్పందించారు. అలా అనుకుంటే.. గల్ఫ్ దేశాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని, అయినా.. అక్కడ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అయితే.. భారత వైరాలజీ నిపుణులు, అమెరికా తదితర దేశాల నిపుణులు చేసిన అధ్యయనంలో ఎండలో వైరస్ ఎక్కువ సేపు జీవించి ఉండదని, తొందరగా చనిపోతుందన్న విషయం తేలినట్లు చెబుతున్నారు. అందుకే 130కోట్ల జనాభా ఉన్న భారత్లో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, మండే ఎండలే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. అయితే.. దీనిపై మరింతగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. నిజానికి.. మొదటి నుంచీ భారత్లో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్వైపు చూస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు.. ఇక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితులు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నాయన్న విషయాన్ని నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే.