కాటేస్తున్న కరోనా.. ఘోర రోడ్దు ప్రమాదం.. 23 మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు.. !
మనసు చలించగానే కన్నీరు వస్తుంది.. కానీ ఆ కన్నీటికి ఏం తెలుసు తాను ఎందుకు వస్తుందో.. కానీ ఇప్పుడు లోకం అంతటా మనసును కరిగించే సంఘటనలే.. నిరంతరంగా కన్నీరు ప్రవహించే దృశ్యాలే.. దీనికంతటికి కారణం కరోనా.. ఈ వైరస్ తెచ్చిన వానికంటే, దీని వల్ల పేద వలస కూలీల కష్టాలు నిప్పుల కొలిమిలో కాలే ఇనుప ముక్కలా మారాయి.. ఇప్పుడున్న సమయంలో ధనవంతుడు బాగానే ఉన్నాడు.. కానీ ధనం లేని పేదవారు మాత్రం క్షణ క్షణం నరకయాతన అనుభవిస్తున్నారు.. అసలు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియని పరిస్దితుల్లో వారు బ్రతుకులు వెల్లదీస్తున్నారు..
ఇక పేద వారికి, వలస కూలీలకు అన్ని వైపుల నుండి ప్రమాదం పోంచి ఉంది.. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో జీవనాన్ని కొనసాగించలేక సొంత ఊర్లో అయినా గంజి నీళ్లు తాగి బ్రతుకుదామని తమ ప్రయాణాన్ని మొదలెట్టిన వారు గమ్యం చేరుకోకుండానే అసువులుబాస్తున్నారు.. ఇకపోతే వలస కూలీలు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ కు వెళ్లుతుండగా ఉత్తర్ప్రదేశ్లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ట్రక్కులు ఢీకొనడంతో 23 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.. ఈ ఘటనలో చిక్కుకున్న వారంత బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు.
ఇకపోతే ఇటీవల ఔరంగాబాద్ వద్ద గూడ్స్ రైలు ఢీకొని 16 మంది మరణించగా, ఉత్తరప్రదేశ్లో నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలను బస్సు ఢీకొనడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరికొందరు వలస కూలీలు సుదీర్గ ప్రయాణంలో సమయానికి ఆహారం, తాగునీరు అందక, అలసి మృతి చెందుతున్నారు.. ఇక ఈ ఘటనలన్నింటినీ తీవ్రంగా పరిగణించిన కేంద్రం, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క వలస కూలీ కూడా నడిచివెళ్లడానికి వీల్లేదని, వారు స్వస్థలాలకు చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది..
వలస కూలీలను శ్రామిక్ రైళ్లు లేదా ప్రత్యేక బస్సుల ద్వారా మాత్రమే వారి స్వస్థలాలకు తరలించాలని పేర్కొంది.. కానీ ఇది కఠినంగా అమలు జరిగితే కదా.. వలస జీవిలకు ఊరట లభించేది.. అని అనుకుంటున్నారట కొందరు.. ఏది ఏమైన ఈ కరోనా చేస్తున్న మారణ హోమంలో సమిధలుగా కూలీలు, పేదవారు మాత్రమే మారుతున్నారన్నది నిత్యసత్యం అనుకుంటున్నారు..