భాగ్యనగరంలో భయం భయం.. ఒకే ఇంట్లో 15 మందికి కరోనా
హైదరాబాద్లో కరోనా వైరస్ రెచ్చిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 42 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 37, రంగారెడ్డి జిల్లాలో రెండు, వలసదారులకు సంబంధించి మూడు కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని గోషామహల్ సర్కిల్–14లో ఉన్న జుంగూర్బస్తీలో ఆదివారం ఒకేరోజు 15 మందికి కరోనా సోకింది. జుంగూర్ బస్తీలో నివాసం ఉండే ఓ బ్యాంక్ ఉద్యోగి (36)కి ఐదు రోజుల క్రితం వైరస్ సోకింది. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు అతని కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్కు తరలించా రు. వారికి పరీక్షలు నిర్వహించగా ఉద్యోగి తండ్రి (56), అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ఇంట్లోని బంధువులందరికీ కలిపి 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరోవైపు పురానాపూల్ చౌరస్తాలోని ఎస్బీఐ శాఖ నుంచి ఇటీవల నగదు డ్రా చేసుకొని వెళ్లిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అధికారులు బ్యాంక్లో పనిచేసే 13 మంది సిబ్బంది, అధికారులను క్వారంటైన్కు తరలించారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,551కి చేరింది. అందులో వలసదారుల సంఖ్య 57గా ఉంది. ఆదివారం 21 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 992కు చేరింది. ఇప్పటిదాకా మొత్తం 34 మంది మరణించగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 525 మంది ఉన్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం సాయంత్రం వరకు 23,388 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,513 కేసులు నమోదయ్యాయి. అందులో 947 మంది పురుషులు, 566 మంది మహిళలు ఉన్నారు. నెగెటివ్ వచ్చిన వారిలో 14,256 మంది పురుషులు, 7,619 మంది మహిళలు ఉన్నారు.