నీరవ్కు ఈడీ షాక్... హాంకాంగ్లో ఆభరణాల పట్టివేత..విలువెంతో తెలుసా..?
రుణాల ఎగవేత దారుడు నీరవ్ మోదీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టిషాక్ ఇచ్చింది. నీరవ్ మోదీకి సంబంధించి మెహుల్ చోక్సీల కంపెనీలకు చెందిన రూ 1350 కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలను హాంకాంగ్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ రంగ పీఎన్బీని రుణాల పేరుతో రూ 14,000 వేల కోట్ల మేర మోసగించి విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ను అప్పగించాలని భారత ప్రభుత్వం లండన్ కోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్పై గత ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీని లండన్ పోలీసులు కొద్దికాలం క్రితం అరెస్ట్ చేశారు. నీరవ్ను హొల్బొర్న్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్లోని వాండ్స్వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పీఎన్బీని మోసగించిన కేసులో నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. నీరవ్ మోదీకి సంబంధించిన అక్రమాస్తుల చిట్టాలో ఆయనకు అనేక బంగ్లాలు ఉన్నట్లు గతంలో ఈడీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.
అందులో ప్రధానంగా మహారాష్ట్రలోని అలీబేగ్ ప్రాంతంలో సరైన పర్మిషన్ లేకుండా నీరవ్ మోదీ నిర్మించిన ఓ అక్రమ బంగ్లాని కూల్చివేయమని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అనేక సంవత్సరాలుగా మురుద్, రాయగడ్, అలీబేగ్ ప్రాంతాల్లో అక్రమంగా ఇళ్లు, బంగ్లాలు నిర్మించడం జరుగుతోంది. అందులో కొన్ని బంగ్లాలు పంజాబ్ బ్యాంకుకు టోపీ పెట్టిన కేసులో నిందితులైన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ పేరు మీద ఉండగా.. మరికొన్ని బంగ్లాలు స్మితా గోద్రెజ్, మధుకర్ పారేఖ్ లాంటి వ్యాపారస్తుల పేర్ల మీద కూడా ఉండడం గమనార్హం. పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో నీరవ్ మోడీని కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. గత కొంతకాలంగా విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.