జగన్ శాసనమండలి ముఖం చూడరా ?
శాసనమండలి అంటే వైఎస్సార్ కి ఎంతో ఇష్టం. నిజంగా అయన మళ్ళీ రెండు దశాబ్దాల తరువాత ఏపీలో శాసనమండలి పునరుధ్ధరించారు. అటువంటి మండలి వద్దు అని ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. ఆయన అనుకున్నదే తడవుగా మండలిని రద్దు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపారు.
ఈ కధ జరిగి ఆరునెలలు అవుతోంది. ఇపుడు శాసనమండలి రద్దు బిల్లు కేంద్రం పరిశీలనలో ఉంది. అక్కడ న్యాయశాఖ పరిశీలించి కేంద్ర క్యాబినేట్లో పెట్టి ఆమోదించాలి. దాన్ని పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమోదించాలి. అపుడే శాసన మండలి రద్దు అవుతుంది. అంతవరకూ ఏపీలో మండలి ఉంటుంది.
అయితే మండలి రద్దు అని జగన్ అన్న తరువాత అసెంబ్లీ సమావేశాలు ఇప్పటివరకూ జరగలేదు. మార్చిలో బడ్జెట్ జరగాల్సివున్నా కూడా కరోనా వైరస్ వల్ల వాయిదా పడింది. మూడు నెలలకు గాను ఓటాను అకౌంట్ ని గవర్నర్ ద్వారా ఆమోదించుకున్నారు. ఇపుడు ఆ గడువు ముగుస్తోంది. ఇపుడు బడ్జెట్ సెషన్ పెట్టాలి.
అయితే కరోనా ఇప్పటికీ అలాగే ఉంది. పైగా విజయవాడ పరిసరాలాలో ఎక్కువగా ఉంది. దాంతో అసెంబ్లీని సమావేశపరచాలంటే శాసన మండలిని కూడా పిలవాలి. అపుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తారు. ఈ నేల 19న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. దానికి ఎమ్మెల్యేలు అంతా ఓటు వేయాలి.
ఈ నేపధ్యంలో అసెంబ్లీని సమావేశాలు జరిపితే జగన్ మండలి ముఖం చూడక తప్పదు, అక్కడ టీడీపీకి మెజారిటీ ఉంది. ఏ బిల్లు అయినా మండలికి వెళ్ళాల్సిందే. మరి ఇది నిజంగా జగన్ కి ఇబ్బందికరమైన పరిణామమే.
జగన్ ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంతో తలబొప్పి కట్టి ఉన్నారని అంటున్నారు. ఇపుడు శాసనమండలి పేరిట కొత్త తలనొప్పులు కూడా ఎదురవుతాయని అంటున్నారు. మండలి రద్దు కాకపోవడంతో సీనియర్ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు మండలిలో ఉన్నారు. వారితో వైసీపీ తలపడాల్సివుంటుంది.